All Party Meeting : ఏపీలో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద-ప్రజాస్వామ్య పరిరక్షణ’ అనే అంశంపై విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, జనసేన, కాంగ్రెస్ పార్టీల నేతలు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు.
ఒక్కఛాన్స్ ఇస్తే..ఇలా చేస్తారా?
ఒక్కఛాన్స్ కోరితే వైసీపీకి ప్రజలు అవకాశమిచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దీంతో సీఎం జగన్ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆరోపించారు. దోపిడీ చేస్తున్నప్పుడు ప్రశ్నించడం మన హక్కు అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తుంటే పోలీసులు అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేస్తున్నారని.. కేసులు పెట్టినా, జైళ్లకు వెళ్లినా ప్రజల కోసం పోరాడుతున్నామన్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా ఉందన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన వైసీపీ విధ్వంసం.. ఇప్పటం గ్రామం వరకు సాగిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
నిందితుడికి సన్మానాలా?
ప్రజాస్వామ్య హక్కుల కోసం కలిసి పోరాడదామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. నిరసనలను పోలీసులతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ చిత్రపటానికి పాలాభిషేకాలా చేస్తారని ప్రశ్నించారు. హత్యకేసు నిందితుడు బెయిల్పై విడుదలైతే సన్మానాలు చేస్తారని అని నిలదీశారు. అధికారపార్టీకి పోలీసులు లొంగిపోయి వ్యవస్థ పరువు తీస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఆపకపోతే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని అన్నారు. ఈ ప్రభుత్వానికి నోటీసులిచ్చే పరిస్థితులు వస్తాయని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత కందుల దుర్గేశ్ విమర్శలు గుప్పించారు. ప్రజాశ్రేయస్సు కోసం పోరాడే రాజకీయపక్షాలతో జనసేన కలిసి పనిచేస్తుందని ప్రకటించారు. అఖిలపక్ష కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేద్దామన్నారు. రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు అంతా కలిసి పోరాడదామని కాంగ్రెస్ నేత నరసింహారావు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణపై అఖిలపక్ష నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతు ఉంటుందన్నారు. ఏపీలో పొత్తులపై ఇంకా క్లారిటీ లేకపోయినా టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి బీజేపీ నేతలు మాత్రం దూరంగా ఉన్నారు.