Srisailam : శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం, వరుస సెలవులు రావడంతో మల్లన్న క్షేత్రమంతా భక్తజన సందోహంగా మారింది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలో బారులు తీరారు.
శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలు రద్దు చేశారు. సోమవారం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు భావిస్తున్నారు.