AP Inter Results Released Check here: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 67 శాతం, సెకండియర్ ఫలితాల్లో 78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. ఫస్టియర్ ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 81 శాతంతో గుంటూరు జిల్లా రెండోస్థానం, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి.
సెకండియర్ ఫలితాల్లోనూ కృష్ణాజిల్లానే టాప్ లో నిలిచింది. 90 శాతం పాస్ పర్సెంటేజీతో కృష్ణాజిల్లో ప్రథమ స్థానంలో ఉండగా.. 87 శాతంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు రెండో స్థానంలో, 84 శాతంతో విశాఖ జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవాలని సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
మార్చి 1 వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 10,53,435 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 5,17,570 మంది ఉండగా.. సెకండ్ ఇయర్ విద్యార్థులు 5,35,865 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు బోర్డు వివరించింది. ఈ నెల 4వ తేదీలోపే మూల్యాంకనం పూర్తి చేసింది. కాగా.. విద్యార్థులు పరీక్షల ఫలితాలను https://resultsbie.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు. త్వరలో ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బోర్డు 22 రోజుల్లోనే ఇంటర్ పరీక్షల ఫలితాలను వెల్లడించింది.