రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో వైసీపీకి ఎమ్మెల్యేల టెన్షన్ పట్టుకుంది.. రాజ్యసభ ఎన్నికలపై అసమ్మతి ఎఫెక్ట్ పడి.. పార్టీ నిర్ణయించి అభ్యర్ధులు గెలవరేమో అన్న అనుమానంతో .. సెఫ్జోన్లో ఉండటానిని నానా పాట్లూ పడుతోంది .. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ సీటు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన జగన్ .. 3 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. అసమ్మతి ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో హ్యాండ్ ఇస్తారన్న భయంతో .. అసెంబ్లీలో టీడీపీ బలం తగ్గించే పనిలో పడ్డారు ..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే జరగనున్న రాజ్యసభ ఎన్నికలు వైసీపీకి కీలకంగా మారాయి .. ప్రతిపక్షం తెలుగుదేశానికి అవకాశం లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ వ్యూహం మొదలెట్టారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం టీడీపీ వశం అవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్న సీఎం జగన్.. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి ఆ చాన్స్ దక్కకుండా చేయడానికి చక్రం తిప్పుతున్నారు .. స్పీకర్ ద్వారా ప్రతిపక్షానికి ఝలక్ ఇస్తున్నారు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ హఠాత్తుగా ప్రతిపక్షానికి చెక్ పెట్టే నిర్ణయం తీసుకున్నారు.
రాజ్యసభ ఎన్నికల వేళ తెలుగుదేశానికి అవకాశం లేకుండా చేసేందుకు స్పీకర్ చకచకా నిర్ణయాలు తీసుకున్నారు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఎప్పుడో 2021లో .. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావు .. ఆ రాజీనామాను ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హఠాత్తుగా ఆమోదించారు.. అంతేకాకుండా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిధర్లకు నోటీసులిచ్చారు .. అటు వైసీపీ నుంచి టీడీపీ వైపు చూస్తున్న ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, జనసేన నుంచి వైసీపీలో చేరిన రాపాక వరప్రసాద్లకు కూడా నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి దెబ్బేసిన తన పార్టీ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన వైసీపీ.. వారిపై చర్యలకు స్పీకర్కు ఫిర్యాదు చేసింది.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడనున్న రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టు కునే ఆ నిర్ణయం తీసుకుంది.. దాంతో అలెర్ట్ అయిన టీడీపీ తమ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని జనసేనతో కలిసి స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఫిర్యాదు చేసింది.. ఈ ఫిర్యాదును ఇప్పుడు పరిగణలో తీసుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం మొత్తం 9 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.. వారం రోజుల్లోగా సంతృప్తికర సమాధానం ఇవ్వాలని కోరారు. లేకపోతే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. అందులో కొందరు నెలరోజుల సమయం అడిగినా స్పీకర్ మాత్రం వారం రోజులే వ్యవధి ఇచ్చారు.
ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది.. ఈ 3 రాజ్యసభ సీట్ల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో మూడు సీట్లనూ చేజిక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అధికార వైసీపీ..
ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి 44మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.. అంటే మూడు రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి.. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ గెలిచినప్పటికీ.. ప్రస్తుతం ఆ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు.. వైసీపీ నుంచి గెలుపొందిన నలుగురు టీడీపీకి సన్నిహితంగా ఉంటుండటంతో వైసీపీకి అనుకూలంగా ఓట్లు పడే అవకాశం లేదు.. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 147కు తగ్గింది.
ఇక ఎన్నికల కసరత్తులో భాగంగా 28 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ టికెట్ ఇవ్వలేదు.. ఇప్పటికి నాలుగు జాబితాల్లో 58 అసెంబ్లీ స్థానాల ఇంచార్జిలనే వైసీపీ ప్రకటించింది.. అందులో 28 మంది ఎమ్మెల్యేల సీట్లు గల్లంతయ్యాయి.. మున్ముందు విడుదల చేసే జాబితాల్లో ఇంకెంత మందికి టికెట్ నిరాకరిస్తారో క్లారిటీ.. టికెట్ దక్కని వారంతా సహజంగానే పార్టీపై అసంతృప్తితో ఉంటారు.. అలాంటి వారు పార్టీని దెబ్బ కొట్టడానికి రాజ్యసభ ఎన్నికలను వేదిక చేసుకునే అవకాశం ఉంది .. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి వంటి టికెట్ దక్కని ఎమ్మెల్యేలు జగన్ని ఓపెన్గానే టార్గెట్ చేస్తున్నారు .. ఆ జాబితాలో ఇంకెంత మంది చేరతారో అన్న ఆందోళనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఒక వేల తన మార్పుల చేర్పుల లెక్కలతో పార్టీ బలం తారుమారవుతుందేమో అన్న భయంతోనే జగన్ .. స్పీకర్తో గంటా రాజీనామాను ఆమోదింప చేయడంతో పాటు .. అనర్హత వేటు ఎపిసోడ్కు తెరలేపారంటున్నారు .. వైసీపీలో అసమ్మతి టీడీపీకి ఫేవర్గా మారే పరిస్థితి ఉండటం .. ఎమెల్సీ ఎన్నికల తరహాలో రాజ్యసభ ఎన్నికల్లో కూడా చంద్రబాబు మరోసారి చక్రం తిప్పుతారన్న ఆందోళనతోనే ఈ తతంగం కానిస్తున్నారంటున్నారు. 3 రాజ్యసభ స్థానాలకు 132 మంది ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరి కావడంతో .. ఆ బలాన్ని కాపాడుకుంటూ.. టీడీపీకి చాన్స్ లేకుండా చేయడమే జగన్ టార్గెట్గా కనిపిస్తోంది .. మరి చూడాలి వైసీపీ బాస్ ఎంత వరకు వర్కౌట్ అవుతాయో?