Husband : మనుషుల్లో సైకోయిజం రోజురోజుకు పెరుగుతోంది. ఉన్మాదులుగా మారిపోతున్నారు. ఇలాంటి ఓ మూర్ఖపు భర్త భార్యను పుట్టింటికి దూరం చేశాడు. అతడు చదువు, సంధ్యలు లేనివాడు కాదు. ఉన్నత విద్య అభ్యసించిన వాడే. పైగా లాయర్ కూడా. భార్యను ఇంట్లోంచి బయటకు రానివ్వలేదు. పుట్టింటితో సంబంధాలు కట్ చేశాడు. తన గృహంలోనే ఓ గదికి ఆమెను పరిమితం చేశాడు. నెల కాదు ఏడాది కాదు ఏకంగా 13 ఏళ్లపాటు ఇలా భార్యను బందీగా చేశాడు. పుట్టింటివారి పోరాటంతో ఇన్నాళ్లుకు ఆ మహిళకు విముక్తి కలిగింది. భర్త విధించిన బందీఖానా నుంచి బయట పడింది. 13 ఏళ్ల తర్వాత బాహ్య ప్రపంచాన్ని చూసింది. తల్లిని, సోదరుడిని కలుసుకుని సంతోష పడింది.
విజయనగరం ఒకటో పట్టణ సీఐ వెంకటరావు కథనం ప్రకారం.. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన మధుబాబు న్యాయవాది. సత్యసాయి జిల్లాకు చెందిన జనార్దన్,హేమలత దంపతుల కుమార్తె సాయిసుప్రియను 2008లో వివాహం చేసుకున్నారు. సుప్రియ 2009లో ప్రసవానికి పుట్టింటికి వెళ్లారు. కుమార్తె పుట్టాక అత్తారింటికి వచ్చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకుండా చేశారు భర్త. ఫోన్లో కూడా మాట్లాడనీయకుండా ఆమెపై ఆంక్షలు పెట్టారు. ఆ తర్వాత ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. ఆ విషయాన్ని పుట్టింటికి తెలియనివ్వలేదు. సాయిసుప్రియను చూసేందుకు తల్లిదండ్రులు ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ మధుబాబు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. కుమార్తెను చూడాలని తపించిన జనార్దన్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే మంచం పట్టారు.
ఫిబ్రవరి 27న సాయిసుప్రియ తల్లి హేమలత స్పందన కార్యక్రమంలో తన కుమార్తె పరిస్థితిపై ఎస్పీ దీపిక ఎం.పాటిల్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో మధుబాబు ఇంటికి ఒకటో పట్టణ పోలీసులు వెళ్లి ఆరా తీశారు. కానీ మధుబాబు వారిని తన ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సెర్చ్ వారెంట్తో సీఐ వెంకట్రావు, ఎస్ఐలు,మహిళా పోలీసులు, వీఆర్వో ఆ ఇంటికి వెళ్లారు. మధుబాబు తలుపు తీయలేదు. దీంతో బలవంతంగా లోపలికి వెళ్లారు. సుప్రియను తమ వెంట పంపించాలని కోరినా అంగీకరించలేదు. కానీ పోలీసులు ఆమెను తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.రెండు కుటుంబాలను న్యాయ సేవాధికార సంస్థ ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి రమ్య తీర్పునిచ్చారు. ఆ తర్వాత సాయిసుప్రియ తన తల్లిని సోదురుడిని కలుసుకున్నారు. ఎంతో ఆనందపడ్డారు. తన కుమార్తెను 13 ఏళ్ల తర్వాత చూసిన తల్లి ఎంతో సంబరపడ్డారు.