Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లలో ఆలయ అధికారులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. అయితే ఈ క్రమంలో జరిగిన ఓ ఘటన.. బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి ఘటనగా పలువురు అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు. అర్చకుల సూచనలతో చక్కదిద్దే పనికి పూనుకున్నారు. ఇంతకు అసలేం జరిగిందంటే..
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేటి సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సంధర్భంగా ధ్వజస్తంభం కొక్కెం ద్వారానే గరుడ పఠాన్ని ఎగురవేస్తారు అర్చకులు. అయితే ఈ కొక్కి అకస్మాత్తుగా విరిగిపోయిన పరిస్థితి. కొక్కి విరిగినట్లు గుర్తించిన అధికారులు.. అర్చకులకు సమాచారం అందించారు. అర్చకులు హడావుడిగా ధ్వజస్తంభం వద్దకు చేరుకున్నారు. వెంటనే కొక్కిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవల తిరుమల లడ్డుకి వినియోగించిన నెయ్యి కల్తీకి గురైనట్లు వివాదం రేగగా.. యావత్ దేశం మొత్తం తిరుమలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో తిరుమల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ అన్ని చర్యలు తీసుకుంది. అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది.
Also Read: Weekly Horoscope: వచ్చే వారం రోజుల పాటు మీ జాతకం ఎలా ఉండబోతుందో తెలుసా ?
ఇక,
పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వేంకటాద్రిపై వెలిసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవున్ని పిలిచి లోకకల్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఈ ప్రకారం ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవేంకటేశ్వరుడికి కన్యామాసంలోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారట. అందువల్లే ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధిచెంది అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు 9 రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు వివిధ వాహనాలపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్యర్శనం కల్పిస్తారు.
బ్రహ్మోత్సవ వాహనసేవలకు విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు పూర్తిచేసింది. భక్తులందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూలవిరాట్ దర్శనం కల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ సాయంత్రం 6.30 నుండి రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీలలో వేచివుండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు.