TTD: తిరుమల తిరుపతి దేవస్థానంపై సామాజిక మాధ్యమాలలో జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందించారు. శ్రీవారి ట్రస్టు దర్శనం టికెట్లు ఆదాయం కోసమే ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని భక్తులు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ఉందని, వాటిలోనే విరాళాలు జమ అవుతాయని ఈవో తెలిపారు. టీటీడీ నుంచి సొమ్ము ప్రభుత్వానికి అందే ప్రసక్తే లేదన్నారు. మరింత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా శ్రీవాణి ట్రస్టు దాతలకు ఇచ్చే బ్రేక్ దర్శన టికెట్ల సంఖ్యను వెయ్యికి తగ్గించామన్నారు. ఇందులో 750 టికెట్లు ఆన్లైన్లో, 250 టికెట్లు ఆఫ్లైన్లో రేణిగుంట ఎయిర్ పోర్టులో జారీ చేస్తున్నట్టు చెప్పారు.
తిరుమల శ్రీనివాసుడి వైభవాన్ని నలుమూలల వ్యాప్తి చేయడంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు నిధులతో ఇప్పటి వరకు రెండు వేలకు పైగా ఆలయాల నిర్మాణం చేపట్టినట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు.. తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఈ ఆలయాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. శ్రీవాణి ట్రస్టుకు దాతల నుంచి రూ.650 కోట్ల విరాళాలు అందాయని చెప్పారు. సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో 2019కు ముందు 502 ఆలయాలు నిర్మించినట్టు వెల్లడించారు.
శ్రీవారి ఆలయం డ్రోన్ వీడియోపై ఈవో ధర్మారెడ్డి స్పదించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేశామని.. వైరల్ అయినా వీడియోలు నిజమైనవా లేక ఫేక్ వీడియోలా అని తేలాల్సి ఉందన్నారు. డ్రోన్ ఆపరేటర్ల అత్యుత్సాహంతో వీడియోలు తీసుంటే చర్యలు తీసుకుంటామన్నారు.
తిరుమలలో డ్రోన్ సర్వేకు IOCకు అనుమతి ఇచ్చింది వాస్తవమని.. అన్నదానం దగ్గర నుంచి డంపింగ్ యార్డ్ వరకు వారికి డ్రోన్ సర్వేకు పర్మిషన్ ఇచ్చామన్నారు. టీటీడీలో భద్రతకు ఎక్కడా రాజీ పడటంలేదని.. టీటీడీ హై సెక్యూరీటీ వ్యవస్థ ఉందన్నారు. త్వరలో తిరుమలకు యాంటీ డ్రోన్ టెక్నాలజీ తీసుకొస్తున్నామన్నారు.