AP: ఏపీలోని ఆలయాల భద్రత గాల్లో దీపంలా మారిందా? శ్రీశైలం మల్లన్న ఆలయంపై డ్రోన్లు ఎగరడం నిత్యకృత్యంగా మారింది. కాణిపాకం ఆలయంలోని మూలమూర్తి ఫోటోలు, శ్రీకాళహస్తి శాసనాలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఆలయాల్లోకి ఫోన్లు తీసుకెళ్తుంటే.. అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నట్టు? ఆలయాలకు భద్రత విషయంలో సర్కార్ మొద్దునిద్ర పోతోందని విమర్శలకు సమాధానం ఉందా?
ఏపీలో ఆలయాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ క్షేత్రాలలో సిబ్బంది నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఇటీవల శ్రీశైలం ఆలయంపై డ్రోన్ ఎగురవేశారు. ఇలా శ్రీశైలం ఆలయంపై డ్రోన్ లు ఎగురవేయడం ఇది నాల్గోసారి.
అటు కాణిపాకం ఆలయంలోకి సెల్ఫోన్లు నిషేధించి చాలకాలమైంది. అయితే ఓ వైసీపీ నాయకుడు మూలమూర్తిని దర్శించుకునే చిత్రాన్ని సోషల్ మీడియాలో అతని అనుచరుడు పోస్ట్ చేశారు. కాళహస్తీశ్వరుడి ఆలయంలోని గర్భగుడి గోడలకు ఉన్న శాసనాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. శ్రీకాళహస్తిలో కూడా సెల్ ఫోన్లు నిషేధం. ఇలా ఏపీలోని ప్రముఖ ఆలయాల గర్భగుడి చిత్రాలు.. బయటకురావడం ఏకంగా భద్రతపై అనుమానాలకు తావిస్తోంది.
కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో ఎలాంటి భద్రత కల్పిస్తున్నామో.. రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రముఖ ఆలయాలకు అదే తరహా సెక్యూరిటీ కల్పిస్తామని ప్రభుత్వ పెద్దలు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ప్రతిరోజు ఎక్కడో ఒక్కచోట ఇలాంటి వివాదాలు తలెత్తున్నాయి. పవిత్ర స్థలాల్లో యదేచ్ఛగా మద్యం, మాంసం, గంజాయిలాంటివి దొరుకుతున్నాయి. ఆలయాల భద్రత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అటవీ ప్రాంతంలో ఉండే శ్రీశైలం లాంటి క్షేత్రంలో డ్రోన్లు ఎగరువేయడమంటే ఆలయ భద్రతను గాలికి వదిలి వేయడమే. ముఖ్యంగా డీఎస్పీ స్థాయి అధికారికి ఇక్కడ ఆలయ భద్రతను అప్పగించాల్సి ఉంది. కేవలం సీఐ ర్యాంకు అధికారి మాత్రమే భద్రతా వ్యవహరాలను చూస్తున్నారు. ఆలయానికి సమీపంలోనే తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం డ్యాం ఉంది. ఎంతో భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా ఓ అధికారికి బాధ్యతలు అప్పగించి చేతులు దులుపుకుంటోంది.
జాతి సంపదగా భావించే పురాతన పుణ్యక్షేత్రాల భద్రత విషయంలో ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయాల భద్రతకు సంబంధించి పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలంటున్నారు.
అధికార పార్టీ నాయకుల అనుచరులు మూలమూర్తుల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినా అధికారులు మాత్రం వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాణిపాకంలో స్వామివారి ఫోటోను ఫేస్బుక్ ఐడితో పోస్టు చేసింది అజ్ఞాత వ్యక్తి అంటూ కేసులు పెట్టడాన్ని గుర్తుచేస్తున్నారు. అంటే రాజకీయ నాయకులకు భయపడిపోతున్నారా? భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.