Neem Tree: మన సమాజం ప్రకృతిని దైవంగా భావిస్తుంది. పంచ భూతాలనూ దేవతలుగా పూజిస్తుంది. కనిపించే నదులు, చెట్లు, పుట్టలు, వనాలను కూడా కొలుస్తుంది. వన జాతరలకూ పోతారు. మన సాంప్రదాయాలు చాలా వరకు మనల్ని ప్రకృతిలో భాగం చేసేలా ఉంటాయి. మనం కూడా చాలా సార్లు.. కొన్నిసార్లు మన ప్రమేయమే లేకుండా ప్రకృతితో మమేకం అవుతుంటాం. ముఖ్యంగా గిరిజనుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తు్న్నానంటే.. సాధారణంగా ఈ పంచభూతాలకు, చెట్లు, పుట్టలకు దేవాలయాలు నిర్మించరు. అతి సాధారణంగా వీటిని పూజించడం జరిగిపోతుంది. కానీ, గుంటూరు ప్రజలు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ఎప్పుడూ కళ్లెదుటే కనిపించే వేప చెట్టును అమ్మవారిగా భావించి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించారు.
వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తి మనకు వృక్షాల ప్రాధాన్యతను తెలియజేస్తుంది. చెట్లను కాపాడితే.. అవి మనల్ని కాపాడుతాయని ఇది వివరిస్తుంది. మనం చాలా వరకు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో అడవిపై ఆధారపడతాం. అందుకే చెట్టును కూడా దైవంగా కొందరు కొలుస్తారు. వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్డులో ఉండే మహా వృక్షాన్ని కొన్ని దశాబ్దాల క్రితం అక్కడే నివసించిన గిరిజనలు కొలిచేవారు. ఏ సమస్య వచ్చినా వేప చెట్టుకు చెప్పుకుని ఓదార్పు పొందేవారు. మానసిక ప్రశాంతతను ఈ చెట్టు కింద పొందేవారు.
కానీ, కాలక్రమేణా ఆ గిరిజనులు అక్కడి నుంచి మాయమయ్యారు. అక్కడకు చాలా మంది వేరే చోట నుంచి వలస వచ్చి స్థిరపడ్డారు. అయితే, వారి కంటే గిరిజనులు పూజించిన వేప చెట్టు పట్లా వీరు కూడా అదే భక్తి శ్రద్ధలను కనబరిచారు. తరాలు మారినా ఆ భక్తి సాంప్రదాయం మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఆ చెట్టుకు దేవాలయం నిర్మించాలనే కాంక్ష ఏర్పడింది. ఏకంగా అద్భుతమైన గుడి నిర్మించారు. గుడి ముందు ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గుడికి మహాలక్ష్మమ్మ బొమ్మలు వేయించారు.
Also Read: Farm Loans: రైతుల సొమ్ము.. రాబందుల పాలు.. వ్యవసాయ సొసైటీల్లో అవినీతి తిమింగలాలు
ఇక్కడ దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇతర పండుగలకు కూడా స్థానికంగా ఉండే కుటుంబాలు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తుంటారు. ఈ ఏరియాకు మహాలక్ష్మమ్మ సెంటర్గా పేరు స్థిరపడ్డది.
హిందూ మతంలో అనేక సాంస్కృతిక పాయలు కనిపిస్తాయి. గిరిజనుల ఆచరాలు మొదలు వైదిక ధర్మాల వరకు అన్ని రకాల పూజలు ఇందులో ఉంటాయి. గిరిజనుల ఆచార వ్యవహారాలు, ఆధ్యాత్మిక భావనలు కొంత భిన్నంగా ఉంటాయి. వాటిని కూడా హిందూ మతం తనలో కలుపుకుంది. గిరిజనులు పూజలు మొదలు పెట్టిన ఈ చెట్టుకు గుడి కట్టి.. ఇప్పుడు దసరా నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఇందుకు నిదర్శనం.