US: అమెరికాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న వీర సాయిష్ని దుండగులు కాల్చిచంపారు. విద్యార్థి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు… ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లిన సాయిష్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో నెలరోజుల్లో చదువు పూర్తి చేసుకునే సమయంలో వీర సాయిష్ ఇలా ప్రాణాలు కోల్పోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. సాయిష్ ఇటీవలే హెచ్ 1 బీ వీసా దక్కించుకున్నాడు. రెండు వారాల్లో బంక్లో ఉద్యోగం మానేద్దామని కూడా సాయిష్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంతలోనే విషాదం చోటు చేసుకుంది.
అమెరికాలోని వెస్ట్ కొలంబస్లోని గ్యాస్ స్టేషన్లో వీర సాయిష్ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి స్టేషన్ వద్దకు వచ్చిన దుండగులు దోపిడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన సాయిష్పై కాల్పులు జరిపి డబ్బులతో పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీర సాయిష్ను ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. అనుమానితుడి ఫోటోలు విడుదల చేశారు కొలంబస్ పోలీసులు. వీరసాయిష్ మృతదేహాన్ని భారత్కు పంపేందుకు అతని స్నేహితులు ఆన్లైన్ ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు.
పాలకొల్లుకు చెందిన సాయిష్ కుటుంబం కొద్ది కాలం క్రితం ఏలూరులో స్థిరపడ్డారు. రెండేళ్ల క్రితం అనారోగ్య కారణాలతో సాయిష్ తండ్రి కూడా మృతిచెందాడు. తండ్రి చివరి కోరిక తీర్చడానికి వీరా సాయిష్ అమెరికా వెళ్లాడు. మరో మూడు నెలల్లో చదువు పూర్తవుతుందని అనుకుంటున్న సమయంలో సాయిష్ దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కొద్ది రోజుల్లో తిరిగి వస్తాడనుకున్న సాయిని దారుణంగా హత్యచేశారని తల్లి వీరా జయశ్రీ కన్నీరుమున్నీరయ్యారు. చేతికందిన కొడుకు ఇలా అవుతాడు అనుకోలేదంటూ బోరున విలపించారు.