Teachers Transfer: ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. గత ప్రభుత్వం ఇచ్చిన టీచర్ల బదిలీ ఉత్తర్వులను నిలిపివేశారు. ఎటువంటి బదిలీలు చేపట్టవద్దని డీఈఓలకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో దాదాపు 1,800 మంది టీచర్లను బదిలీ చేశారు. తాజాగా, ఈ అమలును నిలిపివేశారు.
బొత్స ఒత్తిడితోనే జరిగిందా?
రాష్ట్రంలో జూన్ 12న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి వర్గంతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చంద్రబాబు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల సమయంలో వివాదాస్పద నిర్ణయాల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు వెలువడుతున్నాయి. ప్రధానంగా టీచర్ల బదిలీలకు సంబంధించి పైరవీలు, సిఫార్సులతో జరిగాయనే ఆరోపణలు వినిపించాయి. మరోవైపు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒత్తిడి కారణంగానే సిఫార్సులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీచర్ల బదిలీలు నిలిపివేయాలని ఆదేశాలు రావడంతో గత ప్రభుత్వం జారీ చేసిన టీచర్ల బదిలీలను విద్యా శాఖ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని సమాచారం.
Also Read: ఎంపీ సీటు త్యాగం, నాగబాబుకు కీలక పదవి!
సర్వత్రా ఉత్కంఠ
టీచర్ల బదిలీలకు సంబంధించి గత ప్రభుత్వం జీఓ నంబర్ 47 జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2023 ఏప్రిల్ వరకు 5 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రతీ ఉద్యోగి బదిలీలకు అర్హులుగా నిర్ణయించింది. అయితే 2022-23 విద్యా సంవత్సరం నాటికి 5 ఏళ్లు ఒకే చోట సర్వీసు పూర్తి చేసిన గ్రేడ్ 2 టీచర్లతోపాటు 8 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ఇతర టీచర్లను తప్పనిసరిగా బదిలీ చేసేలా నిర్ణయానికి వచ్చారు. అయితే వీటిని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ వ్యవహారంపై కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం విచారించే అవకాశం ఉండనుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.