Macharla: అసలే పల్నాడు. అందులో మాచర్ల. తరుచూ రాజకీయ ఉద్రిక్తత. తాజాగా, మరోసారి మాచర్ల రణరంగంగా మారింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. గాజు సీసాలు విసురుకున్నారు. పదుల సంఖ్యలో కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు మాచర్లలో 144 సెక్షన్ విధించి పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
టీడీపీ వర్గీయులు ‘ఇదేం ఖర్మ.. రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహిస్తూ స్థానికంగా ప్రదర్శన చేపట్టారు. పోటీగా వైసీపీ శ్రేణులు సైతం ఏకమయ్యాయి. సడెన్ గా టీడీపీ ప్రదర్శనపై వైసీపీ వాళ్లు దాడికి దిగారు. వెంటనే తేరుకున్న తెలుగు తమ్ముళ్లు సైతం ఎదురుదాడి చేశారు. కర్రలతో కొట్టుకున్నారు. రాళ్లు, సీసాలు విసురుకున్నారు. వాహనాలు ధ్వంసం చేసుకున్నారు. ఇరువర్గాల ఘర్షణతో రాత్రి వేళలో మాచర్ల రణరంగంగా మారింది.
ఇంత గొడవ జరుగుతుంటే.. ఎప్పటిలానే పోలీసులు ఆలస్యంగా వచ్చారని అంటున్నారు. లాఠీఛార్జి చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిపైనా పోలీసులు లాఠీ ఎత్తారని ఆ పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసులు బ్రహ్మారెడ్డిని అక్కడి నుంచి బలవంతంగా పంపించివేశారు. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
టీడీపీ ఇంఛార్జ్ బ్రహ్మారెడ్డిని గుంటూరుకు తరలించారు పోలీసులు. అయితే, బ్రహ్మారెడ్డిని తీసుకెళుతుండగా వైసీపీ వర్గీయులు ఆ వాహనాన్ని వెంబడించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మరోవైపు, మాచర్ల టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టడంతో పరిస్థితి చేజారిపోయింది. విషయం తెలిసి సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ఇరు పార్టీల కార్యకర్తలు మాచర్లకు చేరుకుంటున్నారు. పోలీసులు భారీగా మోహరించడంతో.. మాచర్లలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉంది.