AP MLC: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని ఫలితం వెలువడింది. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. దీంతో అధికార పార్టీ వైసీపీకి షాక్ తగిలినట్లైంది. ఈ ఎన్నికల్లో 7కి 7 స్థానాల్లో విజయం సాధించాలని వైసీపీ పట్టుదలతో ఉంది. కానీ.. అనురాధ విజయం సాధించి అధికార పార్టీకి ఝలక్ ఇచ్చారు.
మరోవైపు తన ఎమ్మెల్యేలకు జగన్ బుధవారం అర్థరాత్రి వరకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై క్లాస్ ఇచ్చారు. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఐతే.. వైసీపీ ప్లాన్ బెడిసి కొట్టింది. టీడీపీ నుంచి రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీకి ఓటేస్తారని అనుకుంటున్న క్రమంలో… క్రాస్ ఓటింగ్ తో అనురాధా విజయం సాధించారు.
ఈ ఫలితంతో టీడీపీ మైండ్ గేమ్.. వైసీపీ ఎమ్మేల్యేలపై బాగానే పనిచేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీతో 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనే ప్రచారం బాగానే వర్కవుట్ అయింది.
ఇంతకీ, పంచుమర్తి అనురాధ విజయానికి ఓటేసిన ఆ నలుగురు ఎవరు? ఇప్పుడు అందరిలోను ఇదే ప్రశ్న. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసినట్టే. వాళ్లు ఎవరు అన్నది ఉత్కంఠగా మారింది. ఇద్దరు మాత్రం ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తామని చెప్పారు. ఒకరు సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, మరొకరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వాళ్లిద్దరూ టీడీపీకే ఓటు వేసి ఉంటారు. మిగతా ఇద్దరు ఎవరు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేసి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. మరో ఎమ్మెల్యే ఎవరనేది తేలాల్సి ఉంది. కోటంరెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి కాకుండా అనురాధకు ఓటేసిన ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అన్న విషయంపై వైసీపీ మల్లగుల్లాలు పడుతుంది.
ఏపీ శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. టీడీపీకి అధికారికంగా 23 మంది సభ్యులు ఉన్నారు. జనసేనకు ఒక సభ్యుడు ఉన్నారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైసీపీ నుంచి పోటీలో ఉన్న ఏడుగురు గెలుపొందాలంటే 154 మంది సభ్యులు కావాలి. కానీ 151 మంది సభ్యులు మాత్రమే వైసీపీకి అధికారికంగా ఉన్నారు. అయితే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరిధర్ ఎప్పటి నుంచో వైసీపీకి మద్దతుదారులుగా ఉన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీవైపే ఉన్నారు. దీంతో వైసీపీకి 156 మంది మద్దతు ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి ఈ మధ్య ఆ పార్టీకి రెబల్స్ గా మారారు.
టీడీపీకి అధికారికంగా 23 మంది సభ్యులున్నారు. గెలవాలంటే 22 ఓట్లు రావాలి. కానీ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపు ఉన్నారు. దీంతో టీడీపీ బలం 19కు తగ్గింది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయిన సరే టీడీపీ అభ్యర్థి విజయానికి ఒక ఓటు తక్కువగా ఉంటుంది. అలాంటిది ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక ఓటు ఎక్కువే వచ్చింది. పంచుమర్తి అనురాధ గెలిచి.. వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు.
ఈ విజయంతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది జగన్ ప్రభుత్వ పతనానికి ఆరంభం మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వైసీపీ నుంచి పెనుమత్స సూర్యనారాయణ, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం ఎమ్మెల్సీలుగా గెలిచారు. జయమంగళ వెంకటరమణ రెండో ప్రాధాన్యత ఓట్లతో గట్టెక్కారు. ఆయన ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇక, ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి కోలా గురువులు.
ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను అనూహ్య విజయంతో టీడీపీ ఫెస్టివల్ మోడ్లో ఉంది. అదే జోష్ ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించారు. ఇది చంద్రబాబు చాణక్యంగా చెప్తున్నారు.