JANASENA vs TDP: ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరో తెలుసా.. రాష్ట్ర రాజకీయాలను శాసించిన వ్యక్తి ఆయన. అంతేకాదు నియోజకవర్గ ఎమ్మెల్యేగా.. 70 వేల మెజారిటీని కూడా సాధించారు. ఒక పార్టీకి అధ్యక్షుడు కూడా. అయితే ఆయన నియోజకవర్గంలో జరిగే ఓ ఎన్నిక ఆయనకు తలనొప్పి తీసుకురాగా.. ఆయన పార్టీకి, మద్దతు తెలిపిన పార్టీ మధ్య చిచ్చు రాజేస్తోందన్న అంశం రాజకీయ దుమారం లేపుతోంది. ఇందులో ఎంత వాస్తవం ఉందో లేదో కానీ.. ఇప్పుడే ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆ నియోజకవర్గం ఏమిటో తెలుసా.. అదేనండీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయాన్ని అందుకున్న పిఠాపురం.
ఏపీ ఎన్నికల సమరంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి.. ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ ఎన్నికలలో ఆయా పార్టీలు 11 స్థానాలు మినహా.. మిగిలిన స్థానాలలో విజయాన్ని అందుకున్నాయి. అందులో పిఠాపురం నుండి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గెలుపుపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితులలో.. సుమారు 70వేల మెజారిటీతో పవన్ ఘన విజయాన్ని సాధించారు. కాగా పవన్ విజయంలో స్థానిక టీడీపీ నేతల పాత్ర కూడా కీలకంగా వ్యవహరించింది. అందుకే ఇక్కడ భారీ మెజారిటీ పవన్ కు సాధ్యమైందని చెప్పవచ్చు. అందుకే పవన్ కూడా స్థానిక టీడీపీ ఇంచార్జ్ వర్మకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. పిఠాపురం పర్యటన సమయంలో పవన్ మాట్లాడుతూ.. టీడీపీ ఇంచార్జ్ వర్మకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని, తన గెలుపు వెనుక వర్మతో పాటు స్థానిక టీడీపీ కార్యకర్తల కృషి ఉందన్నారు.
అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉందన్న చర్చలు ఊపందుకున్నాయి. ఇక్కడ జరిగే ఓ ఎన్నిక ఈ రెండు పార్టీల మధ్య దూరం తీసుకువచ్చిందట. టిడిపి కూటమిలో భాగమైన జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం, అలాగే ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ ఇక్కడ ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకోగా.. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే పడింది.
Also Read: AP Elections: ఏపీలో ఎన్నికలు.. అప్పుడే అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ..
ఇక అసలు విషయంలోకి వెళితే..
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఇక్కడ అక్టోబర్ 6వ తేదీన జరగనున్నాయి. అయితే ఈ సొసైటీలోని 5 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. వైసీపీ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉంది. మొత్తం 18 నామినేషన్లు రాగా.. వాటిలో ఆరు నామినేషన్లు ఉపసంహరణకు గురయ్యాయి. దీనితో 12 మంది ఎన్నికల బరిలో ఉన్నటైంది. వీరిలో జనసేన తరపున కొంత మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. టీడీపీ తరపున మరికొందరు పోటీలో ఉన్నారట. రాష్ట్రంలో మాత్రం కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన మధ్య ఈ సొసైటీ ఎన్నికలు కొంత చిచ్చు రాజేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే రెండు పార్టీల అధిష్టానాలు జోక్యం చేసుకొని.. ఇక్కడి పరిస్థితి ఖచ్చితంగా దిద్దుతాయని తెలుస్తోంది.