TDP : చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ మరో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లిన తర్వాత అనేక పద్ధతుల్లో ఆందోళనలు చేపట్టింది. ఇప్పటికే ‘మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం’ లాంటి కార్యక్రమాలతో నిరసన తెలిపింది.
ఏపీలో ‘అరాచక, చీకటి పాలన సాగిస్తున్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం’ పేరిట మరో వినూత్న నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకి మద్దతుగా ‘నిజం గెలవాలి’ అని గట్టిగా నినదించాలని పిలుపునిచ్చారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని టీడీపీ కార్యకర్తలకు సూచించారు.
ఇప్పటికే చంద్రబాబు సతీమణి నిజం గెలవాలి పేరిట యాత్ర చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ వార్త తర్వాత మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రానికి చంద్రబాబు చేసిన సేవలను ప్రజలకు గుర్తు చేస్తున్నారు.
చంద్రబాబును జైలుకి వెళ్లి 50 రోజులైంది. ఏ తప్పూ చేయకపోయినా వ్యక్తిగత కక్షతోనే అరెస్టు చేశారని నారా లోకేశ్ ఆరోపించారు. ప్రజల మధ్యకు చంద్రబాబును రానీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జ్యుడిషియల్ రిమాండులో ఉన్న చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేశ్ శనివారం ములాఖత్ అయ్యారు. చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ జగన్ను వదిలిపెట్టం.. ప్రజల తరఫున పోరాడుతామని లోకేశ్ స్పష్టం చేశారు.