TDP Leader Atchannaidu Comments on Jagan Stone Attack: సీఎం జగన్ పై దాడి ప్రణాళిక ప్రకారమే జరిగిందని, అది వైసీపీనే చేయించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. వివేకా హత్య, కోడికత్తి తరహాలోనే ఈ రాయి ఘటన కూడా ఎన్నికల్లో లబ్ధి కోసమే జగన్ చేయించారని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో జగన్ కి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే కొత్త నాటకానికి తెరలేపారని అచ్చెన్నాయుడు అన్నారు. విజయవాడ దాడి ఘటన అంతా.. జగన్ ప్లాన్ ప్రకారమే చేయించారని అచ్చెన్న విమర్శించారు. జగన్ పర్యటనలో 3 గంటల పాటు పవర్ కట్ అయితే ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు.
అన్ని గంటలు పవర్ కట్ అయితే జగన్ రోప్ పార్టీ ఏమైందని అచ్చెన్న ప్రశ్నలు లేవనెత్తారు. నాలుగు రోజుల క్రితమే ఈ దాడికి ప్లాన్ జరిగిందని వెల్లడించారు. నాలుగు రోజుల్లో రాజకీయాల్లో సంచలనాత్మక ఘటన జరగబోతోందని.. 4 రోజుల క్రితం ఓ వైసీపీ నేత ట్వీట్ చేశారని అచ్చెన్న తెలిపారు. అతను ట్వీట్ చేసిన విధంగానే సరిగ్గా నాలుగు రోజులకే ఈ దాడి జరిగిందని ఆరోపించారు.
ఈ దాడి ఘటనపై మరో టీడీపీ కీలక నేత వర్ల రామయ్య కూడా స్పందించారు. దాడి జరిగిన కేవలం 10 నిమిషాల్లోనే వైసీపీ నేతలు దర్నాలు చేపట్టారని.. వారికి అంత తక్కువ సమయంలో ప్లకార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ విషయంపై వైసీపీ నేతలకు, కొందరు పోలీసులకు ముందుగానే తెలుసునని ఆరోపించారు.
Also Read: గులకరాయి విసిరితే పోవడానికి.. పావురమా? పిట్టా?.. వైరల్ అవుతున్న కొడాలి నాని వీడియో
పవర్ కట్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది జగన్ కు చుట్టూ రక్షణ కల్పించకుండా ఎందుకు కింద కూర్చున్నారని ప్రశ్నించారు. దాడి జరిగిన వెంటనే వైసీపీ శ్రేణులు చంద్రబాబు, లోకేశ్ లపై ఆరోపణలు చేశారని అన్నారు. అయితే ఈ కేసులో వైసీపీ ఎవరో ఒకరిని తీసుకువచ్చి.. నిందితుడిగా చూపిస్తారని తెలిపారు. ఈ రాయి దాడి ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే నిజాలు భయటకు వస్తాయన్నారు.