TDP : నెల్లూరు జిల్లా కందుకూరు తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాదం జరిగిన వెంటనే ప్రకటించారు. పార్టీ తరఫున 10 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. ఇప్పుడు బాధిత కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయాన్ని పెంచాలని నిర్ణయించారు. ఒక్కో కుటుంబానికి మొత్తం రూ. 24 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ తరఫున తొలుత ప్రకటించిన రూ.10 లక్షలను రూ.15 లక్షలకు పెంచారు. దీంతోపాటు పార్టీకి చెందిన పలువురు నేతలు వ్యక్తిగతంగా బాధితులకు ఆర్థికసాయం ప్రకటించారు. పార్టీ నేతలు ప్రకటించిన రూ. 9 లక్షలతో కలిపి మొత్తం రూ.24 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు ఇస్తారు.
టీడీపీ తరఫున మొత్తం సాయం రూ. 24 లక్షలు
టీడీపీ ఆర్థికసాయం రూ.15 లక్షలు
కంచర్ల సుధాకర్ రూ.2 లక్షలు
కంచర్ల శ్రీకాంత్ రూ. 1 లక్ష
ఇంటూరి నాగేశ్వరరావు రూ. 1 లక్ష
ఇంటూరి రాజేష్ రూ.1 లక్ష
శిష్ట్లా లోహిత్ రూ. 1 లక్ష
బేబీ నాయన రూ. 50,000
కేశినేని చిన్ని రూ. 50,000
అబ్దుల్ అజీజ్ రూ. 50,000
పోతుల రామారావు రూ. 50,000
పొడపాటి సుధాకర్ రూ. 50,000
వెనిగండ్ల రాము రూ. 50,000
మరోవైపు మృతుల కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. ఓగూరులో టీడీపీ కార్యకర్త గడ్డం మధు మృతదేహం వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని చంద్రబాబు ఓదార్చారు. ఆ తర్వాత మధు కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10 లక్షల చెక్కుతోపాటు రూ.1.50 లక్షల నగదును కుటుంబసభ్యులకు అందించారు. పార్టీ తరఫున మొత్తం రూ.24లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించగా.. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే ఆ పార్టీ నేతలు అందజేయనున్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారికి సీఎం జగన్ సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఇస్తామన్నారు. అటు ప్రధాని మోదీ బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి 50 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్నారు.
కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది మృతిచెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమావేశానికి కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఎన్టీఆర్ కూడలి మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. చంద్రబాబు వాహనంతో వచ్చేవారూ ఎక్కువగానే ఉన్నారు. వారంతా ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని గుండంకట్ట వీధిలోకి నెట్టుకుంటూ వెళ్లారు. అప్పటికే అక్కడ జనం ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కందుకూరు తొక్కిసలాట ఘటనపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.