TDP Protest : గుంటూరులో టీడీపీ బీసీ నేతలు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ ను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో కాసేపు తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్ పై ఎస్ఐ నాగరాజు పిడిగుద్దులు గుద్దడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఒంగోలులో సాగింది. ఆ సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంపై వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చారంటూ వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ, మంత్రి జోగి రమేశ్ విమర్శలు చేశారు.
మోపిదేవి, జోగి రమేశ్ కామెంట్స్ పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గుంటూరు లాడ్జ్ సెంటర్లో వైసీపీ నేతల దిష్టిబొమ్మ దహనం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. టీడీపీ నేతల చర్యలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్పై ఎస్ఐ నాగరాజు చేయిచేసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసుల తీరును నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ బీసీ నాయకులు నిరసన కొనసాగించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.