TDP Politics in Kadapa | కడప జిల్లా వ్యాప్తంగా టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని.. కేవలం నాయకత్వ లోపంతో విజయానికి దూరం అవుతున్నామన్న అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. దానికి తోడు వర్గపోరు పార్టీని కలవరపెడుతోందంట.. పార్టీ బలోపేతం సంగతి పక్కన పెడితే నియోజకవర్గాలలో నిలదొక్కుకోవడం ఆ పార్టీ నేతలకు ప్రశ్నార్దకంగా మారుతోందని భావిస్తున్నారంట పార్టీ పెద్దలు.
TDP Politics in Kadapa | కడప జిల్లా వ్యాప్తంగా టీడీపీకి బలమైన క్యాడర్ ఉందని.. కేవలం నాయకత్వ లోపంతో విజయానికి దూరం అవుతున్నామన్న అభిప్రాయంతో ఉన్నట్లు కనిపిస్తోంది ఆ పార్టీ అధిష్టానం. దానికి తోడు వర్గపోరు పార్టీని కలవరపెడుతోందంట.. పార్టీ బలోపేతం సంగతి పక్కన పెడితే నియోజకవర్గాలలో నిలదొక్కుకోవడం ఆ పార్టీ నేతలకు ప్రశ్నార్దకంగా మారుతోందని భావిస్తున్నారంట పార్టీ పెద్దలు. అందుకే టిడిపి అధినాయకత్వం సీనియర్లను, పార్టీకి దూరంగా ఉంటున్న మాజీలను రంగంలోకి దింపాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు మంచి పట్టు ఉండేది. బలమైన క్యాడర్ ఉంది. అయితే 2004 ఎన్నికల నుంచి కడప జిల్లాలో పరిస్థితి మారిపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల పరంగా దాదాపు తుడిచిపెట్టుకు పోయింది. ఉన్న కొద్ది మంది నేతలు పార్టీ లు మారడంతో నాయకత్వ లేమి పార్టీలో కొట్టొచ్చినట్లు కనపడుతోంది. పార్టీ కూడా ఎన్నికల సమయంలో ఎవరికి పడితే వారికి టికెట్లు, స్ధితిమంతులకే నామినేటెడ్ పదవులు ఇచ్చే పరిస్థితి ఉండటంతో ఎవరికి వారు క్యాడర్ ను పట్టించుకోవడం మానేశారు.
కమలాపురం నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇప్పటికీ ఇక్కడ టిడిపి క్యాడర్ బలంగా ఉంది. అంతే స్థాయిలో వర్గపోరు కూడా కనిపిస్తోంది. పుత్తా నరసింహారెడ్డి, వీరశివారెడ్డి, సాయినాథ శర్మ , ఇలా మూడు వర్గాలుగా విడిపోవడంతో తెలుగుదేశం పార్టీ కి తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది.
ఇక జమ్మలమడుగులో నియోజకవర్గంలోను పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. అలాగే 2014లో వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశంలో చేరి మంత్రిగా పనిచేసిన ఆదినారాయణరెడ్డి.. 2019 ఎన్నికల్లో ఓటమితో బీజేపీలో చేరిపోయారు.. దాంతో జమ్మలమడుగు టీడీపీ శ్రేణుల్లో గందరగోళం కనిపిస్తోంది. ఇక్కడ టిడిపి మంచి పట్టు ఉన్న నాయకత్వం ఇతర పార్టీలకు వెళ్ళడంతో .. వారి వర్గాలు రెండుగా చీలిపోయి ఎవరికి వారు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ చార్జ్ గా ఉన్న భూపేష్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నప్పటికీ.. క్యాడర్ పూర్తిస్థాయిలొ సహకరించడం లేదంటున్నారు.
పక్కనే ఉన్న ప్రొద్దుటూరు టీడీపీలో అగ్రనేతలు ఉన్నప్పటికి వర్గ పోరుతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లింగారెడ్జి , ప్రవీణ్ కుమార్ రెడ్డి, వరదరాజుల రెడ్డిల వర్గాలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహిస్తుంటారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ప్రవీణ్ కుమార్ రెడ్డి కి నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు ఇవ్వడం మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డి వర్గాలకు మింగుపడ్డం లేదు. అలాగే బద్వేల్ నియోజకవర్గం ఒకప్పుడు టిడిపి కంచుకోట. కాని ఇప్పుడు ముందుండి నడిపించే నాయకుడు లేకుండా పోయాడక్కడ. ఇక్కడ వర్గాలు లేనప్పటికీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో ఎన్నికల సమయంలో అభ్యర్దులను వెతుక్కోవడం గగనంగా మారుతోంది టీడీపీకి.
జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల పరిస్దితి చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు గెలవక పోయినా.. వర్గాలకు మాత్రం కొదవలేదు. సతీష్ రెడ్డి , బి టెక్ రవి, రాంభూపాల్ రెడ్డి గ్రూపులకు అసలు సరిపడదు. 2019 ఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్న సతీష్రెడ్డి స్థానంలో నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు బిటెక్ రవికి అప్పగించింది టీడీపీ. దాంతో సతీష్ వర్గం ఏమాత్రం సహకరించడం లేదు. అలానే రాజంపేటలో వర్గాలు లేనప్పటికీ స్థానికంగా బలమైన నాయకుడు మాత్రం కనిపించడు. అక్కడ పార్టీ ఇన్చార్జ్ గా ఉన్న బత్యాల చంగల్రాయుడు నాన్ లోకల్ కావడంతో తెలుగు తమ్ముళ్లు ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదంట.
ఇక రైల్వేకోడూరు ఎస్సీ నియోజకవర్గం కావడంతో ప్రతి ఎన్నికల్లోనూ కొత్త అభ్యర్థులను వెతుక్కోవడమే పనిగా పెట్టుకోవాల్సి వస్తోంది టీడీపీకి. రాయచోటి విషయానికి వస్తే టీడపీ టికెట్ కోసం ఏకంగా నలుగురు పోటీ పడుతున్నారు. రమేష్ రెడ్డి , రాంప్రసాద్ రెడ్జి, ప్రసాద్ బాబు , ద్వారకానాథ్ రెడ్డి టికెట్ నాకంటే నాకంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఒకవైపు నాయకత్వ లోపం.. మరోవైపు గ్రూప్ వార్తో సతమతమతమవుతోంది పసుపు పార్టీ.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిస్థితిని గమనించిన చంద్రబాబు జిల్లా పార్టీ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారంటున్నారు. జగన్ సొంత జిల్లాలో టీడీపీ సత్తా చాటాలనుకుంటున్న ఆయన .. పార్టీని వీడిన నాయకులు, సీనియర్ నేతలతో టచ్లోకి వెళ్తున్నారంట. ఆ క్రమంలో కమలాపురం నుంచి వీరశివారెడ్డి , జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, సిఎం రమేష్ , ప్రొద్దుటూరు నుంచి వరదరాజులరెడ్డి , మైదుకూరు నుంచి డిఎల్ రవీంద్రా రెడ్డి , కడప నుంచి మాజీ మంత్రి అహ్మదుల్లా వంటి సీనియర్ నేతలను పార్టీలోకీ ఆహ్వానిస్తే.. పార్టీ బలోపేతంతో పాటు క్యాడర్ కూడా మంచి ఉత్సాహంతో పనిచేసే అవకాశం ఉందని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాల్లోనూ అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే.. ఈ సారి కొంత ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.