వైసీపీ అధికార పీఠాన్ని బద్ధలు కొట్టి.. వచ్చే ఎన్నికల్లో విక్టరీ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది తెలుగుదేశం పార్టీ. జనసేనతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ.. సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఈ దెబ్బకు ఓ తొమ్మిది నియోజకవర్గాలు తమ ఖాతాలో పడ్డట్టే అని చెబుతోంది. ఇంతకీ ఏంటా టీడీపీ వ్యూహాం? చంద్రబాబు పన్నుతున్న వ్యూహామేంటి?
ఏపీలో పొలిటికల్ ఫైట్ పీక్స్కు చేరింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే ధ్యేయంగా ఓటర్లను ఆకట్టుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఇక వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఈసారి తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో నయా ప్లాన్ కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని సమాచారం అందుతుంది.
సాధారణంగా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఎలక్షన్ కమిషన్ తో పాటు ఆయా పార్టీలు కూడా కోరుతుంటారు. కానీ ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడం లేదు. ఇప్పుడీ అంశంపై విపక్ష టీడీపీ కూడా ఫోకస్ చేసింది. గతంలో ఓటు హక్కు వినియోగించుకోని వారినే టీడీపీ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. 2014, 2019 ఎన్నికల్లో ఓటు వేయని వారిపై ఈసారి టీడీపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కూడా ఈ ప్లాన్ ని అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. 11 నియోజకవర్గాలలో ఈ వ్యూహాన్ని అమలు చేస్తే.. 9 నియోజకవర్గాల పరిధిలో టీడీపీ గెలుపొందడం ఖాయమని పార్టీ నిర్వహించిన సర్వేల్లో తేలినట్టు తెలుస్తోంది. దాంతో ఈ ప్లాన్ ని ఏపీలో కూడా ఫాలో చేసేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారంతా పోలింగ్కు బూత్కు వెళ్లడం లేదన్న దానిపై టీడీపీ విశ్లేషణ చేస్తోంది. వారందరితో ఓటు వేపిస్తే గెలుపు నల్లేరుపై నడకే అన్న భావనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. అందుకే వారందరిలో చైతన్యం తీసుకొచ్చి ఓటు వేపించే బాధ్యతను భుజానికెత్తుకనే ఆలోచనలో ఉంది టీడీపీ. మరోవైపు ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉంది టీడీపీ. జనసేన క్యాడర్లో ఎక్కువ మంది యువతే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్న వీరంతా.. ఇకపై ప్రజలను సమర్థ వంతంగా పోలింగ్ బూత్కు నడిపిస్తే చాలు తాము అనుకున్నది సాధించవచ్చన్న ఆలోచనలో ఉంది టీడీపీ.
వీటితో పాటు ప్రస్తుతం అక్కడక్కడ టీడీపీ-జనసేన మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. సీట్లు కాదు.. మన లక్ష్యం వైసీపీని గద్దె దించడమే అని చెప్పకనే చెబుతూ.. ఇరు పార్టీల పెద్దలు విరివిగా కలుస్తున్నారు. హైదరాబాద్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు. పవన్ నివాసంలో ఆయనను కలిసిన చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి.. ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించినట్లు తెలిపారు. సుమారు రెండున్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ కీలక భేటీలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
మొత్తంగా చూస్తే తెర వెనుక మంత్రాంగంతో పాటు.. తెర ముందు భేటీలు, చర్చలు సాగిస్తూ అధికారమే లక్ష్యంగా దూసుకుపోతుంది తెలుగుదేశం పార్టీ.
.
.