TDP Meeting : విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు జనం పోటెత్తారు. టీడీపీ కార్యకర్తలు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనసేన కార్యకర్తలు ఈ సభకు రావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
నారా లోకేశ్ యువగళం పేరుతో చేసిన పాదయాత్ర రెండురోజుల క్రితం ముగిసింది.ఈ నేపథ్యంలోనే ఈ బహిరంగ సభను టీడీపీ నిర్వహిస్తోంది. సీఎం జగన్ ప్రభుత్వ అరాచకత్వాన్ని అణచి వేసేందుకు ఉత్తరాంధ్ర ఉద్యమిస్తూ ముందుకు సాగుతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మరో వంద రోజులు ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. టీడీపీ- జనసేన అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
వర్ల రామయ్య మాట్లాడుతూ..లోకేశ్ యువగళంలో 3,123 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు నేనున్నాననే భరోసాను కల్పించారన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో జనం సభకు వచ్చారని, ఈ సభను చూస్తుంటే రాబోయే రోజుల్లో టీడీపీ-జనసేన పార్టీలు విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.యువగళం పాదయాత్ర అవినీతి పాలకుల గుండెల్లో సింహస్వప్నంలా మారిందన్నారు.
నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజలు అనేక అవమానాలు, వేదింపులకు గురయ్యారన్నారు. మంచి ప్రభుత్వం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి జనం పోటెత్తారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు మారాలనే దిశగా పవన్ అడుగులు వేశారన్నారు.ఈ సభతో జగన్ పాలనను అంతం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి జగన్ ప్రభుత్వం ప్రజలకు నిరాశ తప్పా ఏమీ మిగిల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన అవినీతి ప్రభుత్వానికి అంతం పలకాలని మనోహర్ పిలుపునిచ్చారు.
నారా లోకేశ్ నాయకుడు మాత్రమే కాదు.. పోరాట యోధుడు అని అచ్చెన్నాయుడు కొనియాడారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో జగన్ పాదయాత్రకు ఏ ఆటంకాలు సృష్టించలేదు కానీ లోకేశ్ పాదయాత్రలో అడుగడుగున ఆటంకాలను సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో వేలాది మంది బాధితులను లోకేశ్ ఓదార్చి, ప్రభుత్వ తప్పులు,అవినీతిని ఎండగట్టారన్నారు. జగన్ కొత్త నాటకాలు అడుతూ టీడీపీ – జనసేనను బలహీన పర్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందరం కలిసికట్టుగా పనిప చేసి జగన్ అవినీతి పాలనను అంతం చేయాలని పిలుపునిచ్చారు.