TDP: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కేసును సుప్రీంకోర్టు తెలంగాణ సీబీఐకి బదిలీ చేసింది. ఏపీలో తమకు న్యాయం జరగదని.. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో.. ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక వివేకా హత్య జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై తెలుగు దేశం పార్టీ ఓ పుస్తకాన్ని రూపొందించింది. దానిని జగనాసుర రక్తచరిత్ర పేరుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండ ఉమ తదితరులు శుక్రవారం విడుదల చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై వివరిస్తూ పుస్తకాన్ని తీసుకొచ్చారు.
వైఎస్ వివేకాను చంద్రబాబే హత్య చేయించారని 2019 ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసి సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. వివేకా గుండెపోటుతో చనిపోయాడని చెప్పి.. అవినాష్ రెడ్డి, భాస్కర్రెడ్డి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేశారని అన్నారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. ఈకేసులోని అంశాలను వివరిస్తూ.. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని వెల్లడించారు.