TDP : శ్రీకాకుళం జిల్లా పలాస- కాశీబుగ్గలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడి ఇంటి ముందు కల్వర్టు కూల్చివేతకు అధికారులు ప్రయత్నించడం వివాదానికి దారితీసింది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నాగరాజు 15 ఏళ్ల క్రితం తన ఇంటికి రహదారి నిర్మించుకున్నారు. ఈ దారిలో సాగునీటి కాలువపై కల్వర్టు నిర్మించారు. ఈ నిర్మాణం అక్రమం అంటూ తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
కల్వర్టు వల్ల నీటి ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందులు లేదని నాగరాజు అంటున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా కల్వర్టును తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఆయనకు సంఘీభావంగా ఘటనా స్థలానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, భారీగా నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో భారీగా పోలీసులను మోహరించారు.
కల్వర్టు కూల్చివేతపై అధికారులు, టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ నుంచి పోలీస్స్టేషన్కు తరలించారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై టీడీపీ నేత నాగరాజు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి ఆదేశాలతో అధికారులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.