TDP Leader Varma pithapuram news(AP elections news): పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగానే టీడీపీలో అలజడి రేగింది. మాజీ ఎమ్మెల్యే వర్మ అనుచరులు రోడ్డెక్కారు. ఆయనకు అన్యాయం జరిగిందని ఆందోళనకు దిగారు. పార్టీ మోసం చేసిందని నినాదాలు చేశారు. కొందరైతే టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు కూడా దగ్ధం చేశారు. ఇండిపెండెంట్ గా వర్మ పోటీ చేయాలని అనుచరుల డిమాండ్ చేశారు.
పిఠాపురం నుంచి జనసేనాని పోటీపై టీడీపీ నేత వర్మ స్పందించారు. తాను అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.
వర్మ తొలి నుంచి టీడీపీలోనే ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు . ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి వంగా గీత ఆయనపై విజయం సాధించారు.
2014లో ఎన్నికల్లో వర్మకు టీడీపీ టిక్కెట్ దక్కలేదు. ఈ సమయంలో కచ్చితంగా గెలుస్తానని నమ్మకంగా ఉన్న ఆయనకు పార్టీ మొండిచేయి చూపించింది. పీవీ విశ్వంకు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. అయితే వర్మ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు.
Also Read : పిఠాపురం సెంటిమెంట్.. పవన్ కల్యాణ్ గెలుపు నల్లేరుపై నడకేనా..!
2009 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన వర్మపై ఓటర్లలో సానుభూతి ఏర్పడింది. 2014లో ఆయన విజయంపై ముందే అంచనాలు ఏర్పడ్డాయి. టీడీపీ క్యాడర్ సైతం ఆయనకే ఓట్లు వేసింది. న్యూట్రల్ ఓటర్లు వర్మ వైపు మొగ్గుచూపారు. దీంతో 57 శాతం పైగా ఓట్ల సాధించారు. 47 వేల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబును చిత్తు చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ మూడోస్థానానికి పరిమితమైంది. ఆ పార్టీకి కేవలం 9 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
2019లో వర్మకు మళ్లీ టీడీపీ టిక్కెట్ దక్కింది. అయితే వైసీపీ హవాలో ఆయన ఓడిపోయారు. ఇక్కడ జనసేన అభ్యర్థి సాధించిన ఓట్లు వర్మ విజయావకాశాలను దెబ్బతీశాయి. 2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు దాదాపు 45 శాతం ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి వర్మకు దాదాపు 37 శాతం ఓట్ల వచ్చాయి. అదే సమయంలో జనసేన అభ్యర్థి మాకినీడి శేషుకుమారి 15 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ఈ ప్రభావం ఎక్కువగా టీడీపీపైనే పడింది. అందువల్లే వర్మ ఓటమి చూవిచూశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో ఈసారి టీడీపీకి పిఠాపురం స్థానం దక్కుతుందని వర్మ ఆశించారు. తనకే టిక్కెట్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ టిక్కెట్ చంద్రబాబు జనసేనకు కేటాయించారు. పవన్ కల్యాణ్ తన పోటీపై ప్రకటన చేశారు. ఈ పరిస్థితులు వర్మ అనుచరుల్లో ఆగ్రహం తెప్పించాయి. దీంతో రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మరి అనుచరులు కోరునట్లుగానే వర్మ ఇండిపెండెంట్ గా దిగుతారా? టీడీపీ అధిష్టానం రంగంలో దిగి ఆయనను శాంతింపజేస్తుందా? లేదంటే పవన్ కల్యాణే స్వయంగా వెళ్లి వర్మతో చర్చలు జరుపుతారా? ఈ అంశాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.