Vangalapudi Anitha Comments : మంత్రి రోజాపై టీడీపీ నేత వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా తిట్ల పురాణం, హావభావాలను ఎవరు మరిచిపోయినా.. యూట్యూబ్ ఛానల్ లో చూసుకోవచ్చాన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ సహా కుటుంబ సభ్యులపై వివిధ సందర్భాలలో ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియోలను ఈ సందర్భంగా విడుదల చేశారు. అసెంబ్లీ సాక్షిగా సహచర ఎమ్మెల్యేలు.. అప్పటి మంత్రి పీతల సుజాతపై మాట్లాడిన రోజాకు ఇప్పుడు ఆడతనం గుర్తుకువచ్చి కన్నీళ్లు వస్తున్నాయా అని ప్రశ్నించారు. రోజావి గ్లిజరిన్, మహానటి ఏడుపులని వంగలపూడి అనిత అన్నారు. రోజా నిన్న కన్నీరు పెట్టుకోవడం అంతా పెద్ద డ్రామా అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదొక ప్రాంతంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్న అనిత.. ఆడపిల్లల మాన,ప్రాణాలు పోతున్నా అధికారపార్టీలో ఎవరూ స్పందించలేదని విమర్శించారు. రోజా ప్రతిపక్షంలో ఉండగా మద్యాన్ని నిషేధించాలంటూ మద్యం బాటిల్ పగులగొట్టిన విషయాన్ని అనిత గుర్తు చేశారు. మరి ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బండారు సత్యనారాయణ ఉన్న విషయాన్నే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారన్నారు. రోజా తన గురించి చాలా నీచంగా మాట్లాడారన్న అనిత.. బండారు మాట్లాడిన మాటల్లో అంతకంటే దారుణమైనవేమీ లేవన్నారు.
రోజా టీడీపీలో ఉన్నప్పుడు బ్రాహ్మణికి జడలు కూడా వేశానని చెప్పుకున్నారని.. ఇప్పుడు భువనేశ్వరిపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. భువనేశ్వరిపై విమర్శలు చేస్తున్నపుడు రోజా నవ్విన నవ్వుని ఎప్పుడూ మరచిపోమన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ ల మీద రోజా ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. రోజా, భారతీరెడ్డి గురించి టీడీపీ వాళ్లు మాట్లాడితే పోలీసులు వచ్చేస్తారని.. అదే టీడీపీ వారిగురించి అధికారపార్టీ వాళ్లు ఏం మాట్లాడినా పోలీసుల్లో ఉలుకు పలుకు ఉండదని ఎద్దేవా చేశారు. యూట్యూబ్ లో ఉన్న వీడియోలను రోజా ఇప్పటికైనా తీయించుకోవాలంటూ వంగలపూడి అనిత సూచించారు.