Pattabhi Comments on YSRCP Leaders and Jagan: వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ టీడీపీ అంటూ ఆయన కొనియాడారు. వైఎస్సార్ సీపీ పార్టీ అధికారంలో ఉండగా కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయంటూ పట్టాభి గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించామన్నారు.
‘ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడా కూడా భౌతిక దాడులు జరగవు. హింసను టీడీపీ అసలే ప్రేరేపించదు. నారా లోకేశ్ రెడ్ బుక్ రియాలిటీ. ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తాం. రెడ్ బుక్ లో పేర్లు నమోదైన పిల్ల సైకోలు, అవినీతిపరులైనటువంటి అధికారుల సంగతి ఖచ్చితంగా తేలుస్తాం. చట్టానికి లోబడే గట్టిగా బుద్ధి చెబుతాం. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. పిల్ల సైకోలంతా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత ఐదేళ్లలో వైఎస్సార్ సీపీ నేతలు ఎన్నో పాపాలు చేశారు. దేవాలయం లాంటి మా కార్యాలయంపై కూడా దాడి చేశారు. అప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా..? మాచర్లలో బొండా ఉమా, బుద్ధ వెంకన్నపై దాడి చేసినప్పుడు, చంద్రబాబు అమరావతి పర్యటనలో ఆయనపై రాళ్లు, కర్రలు వేసి మాది భావ ప్రకటనా స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చినప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా..?
Also Read: శ్రీరెడ్డి సూచన, జగనన్నా వాళ్లకి మనకి అదే.. ఎన్నారై వింగ్ కూడా..
బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మావాళ్లకు బీపీలు రావా? అంటూ జగన్ రెచ్చగొట్టేలా మాట్లాడినప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా..? తోట చంద్రయ్య, కంచర్ల జర్లయ్య, కిరణ్, డాక్టర్ సుధాకర్, అబ్దుల్ సలాం, అమర్ నాథ్ వంటి వారి చావుకు కారకులైనప్పుడు.. టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి చేసి కంటిచూపు పోగొట్టినప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా..? యువగళం పాదయాత్రలో సుమారు 22 సార్లు రాళ్లదాడులు జరిగినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా..? జగన్ పాదయాత్ర చేసినప్పుడు అలా జరిగిందా..? అమరావతి రైతులపైనా దాడి చేశారు. అప్పుడు మీకు ప్రజాస్వామ్యం ఏమైంది..? ఇప్పుడా మీరు మాకు నీతి కబుర్లు చెప్పేది..?’ అంటూ వైఎస్సార్ సీపీ నేతలపై పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.