Deepak Reddy on Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిని ‘అంకుశం’ సినిమా తరహాలో పరిగెత్తించి కొట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని సీడాప్ ఛైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి అన్నారు. శుక్రవారం బిగ్ టీవీ వేదికగా నిర్వహించిన చర్చలో దీపక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా దీపక్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
ఇటీవల మాజీ సీఎం జగన్.. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని, తాను మాత్రం ఇప్పటి నుండి గుడ్ బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. ఈ కామెంట్స్ పై శనివారం మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. తనను వైసీపీ ఫాలో అవుతుందని, రెడ్ బుక్ ఓపెన్ చేసి, చట్ట వ్యతిరేకంగా ఎవరైతే తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో.. వారందరినీ చట్టప్రకారం శిక్షిస్తామన్నారు. ఇలా టీడీపీ, వైసీపీ పార్టీలు బుక్స్ ను వార్తల్లోకి తీసుకురాగా.. ఇరు పార్టీల నేతలతో బిగ్ టీవీ ప్రత్యేక చర్చను నిర్వహించింది. ఈ చర్చలో టీడీపీ తరపున సీడ్ ఏపీ ఛైర్మన్ గుణపాటి దీపక్ రెడ్డి పాల్గొనగా.. వైసీపీ తరపున మాజీ ప్రభుత్వ సలహాదారుడు జూపూడి ప్రభాకర్, బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్బంగా దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ హీట్ పెంచాయని చెప్పవచ్చు.
దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నుండి వలసల నివారణకు, పార్టీని కాపాడుకొనేందుకు జగన్ గుడ్ బుక్ తెరపైకి తీసుకువచ్చారన్నారు. పార్టీ నిర్వీర్యమయ్యే స్థితిలో ఇప్పుడు జగన్ కు అందరూ గుర్తుకు వస్తున్నారన్నారు. అలాగే అధికారంలో ఉన్న సమయంలో ఏ ఎమ్మేల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వని జగన్.. ఇప్పుడు గుడ్ బుక్ అంటూ.. మీ పేర్లు రాసుకుంటా.. పార్టీలో ఉండండి అంటూ నాయకులను బ్రతిమలాడుతున్నట్లు తెలిపారు.
Also Read: Temple In Pitapuram: పవన్ నియోజకవర్గంలో ఇదేమిటి ? మరీ ఇంత నిర్లక్ష్యమా.. ఇకనైనా మారేనా ?
అలాగే రెడ్ బుక్ లో మొదటి పేరే కొడాలి నాని పేరు ఉందని, అయితే నానిని అంకుశం సినిమాలో విలన్ ను తరిమి కొట్టినట్లుగా పరిగెత్తించి కొట్టాలని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. తమకు అటువంటి అభిప్రాయం లేదని, చట్టరీత్యా తాము చర్యలు తీసుకుంటామన్నారు. అయినా కూడా కొడాలి నాని పారిపోయి కనిపించకుండా దాక్కున్నారన్నారు. రెడ్ బుక్ లో కేవలం చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారి పేర్లు మాత్రమే ఉంటాయని, జగన్ గుడ్ బుక్ ఓపెన్ చేయకుండా… తమ మూడు తరాల రక్తపాతంపై బ్లడ్ బుక్ ఓపెన్ చేసి చెప్పాలన్నారు.
దీపక్ రెడ్డి కామెంట్స్ పై జూపూడి మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ముంబై నుండి హీరోయిన్ ను తీసుకువచ్చి రాజకీయం చేస్తుందన్నారు. రెడ్ బుక్ అంటే బెదిరింపులకు పరాకాష్టగా మారిందని, తమ గుడ్ బుక్ ద్వారా మంచి చేయాలన్నదే తమ భావనగా జూపూడి చెప్పారు. అలాగే తమ పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం చేసే పార్టీ కాదన్నారు. లోకేష్ రెడ్ బుక్ సిద్దాంతం వేరు.. తమ అధ్యక్షుడి సిద్దాంతం వేరుగా జూపూడి అభివర్ణించారు. ఇలా వీరి మధ్య చర్చ.. విమర్శలు, ప్రతి విమర్శలుగా సాగింది.