TDP-JSP Co-ordination Committee : టీడీపీ-జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం ముగిసింది. రాజమండ్రిలో సోమవారం.. టీడీపీనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల సమక్షంలో నిర్వహించిన ఈ భేటీ దాదాపు రెండున్నర గంటలపాటు కొనసాగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 6 అంశాలపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలు, అరాచకాలు, అవినీతిపై ఛార్జిషీట్, ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాడే ప్రణాళికపై సమన్వయకమిటీ చర్చించింది.
అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైసీపీ నేతలు దాడి చేయని పార్టీ అంటూ లేదని ధ్వజమెత్తారు. తాము వైసీపీకి విధానాలు, అరాచకాలకే వ్యతిరేకం కానీ.. వైసీపీకి వ్యతిరేకం కాదన్నారు. ఏం మాట్లాడినా కేసులు పెట్టేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారన్నారు. ఇసుక దోపిడీ, గనుల దోపిడీ చేస్తూ.. జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. జనసేన ఎన్డీయేలో భాగమైనా కూడా ఏపీకోసం టీడీపీతో పొత్తుపెట్టుకున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టి.. బెయిల్ కూడా రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. 14 ఏళ్ల కుర్రాడిని చంపిన వాడికి కూడా బెయిల్ వచ్చింది కానీ.. చంద్రబాబుకు మాత్రం బెయిల్ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 150 రోజుల సమయం కూడా లేదని.. ఆ లోగానే ఉమ్మడి ప్రణాళిక, కార్యాచరణ, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరిపి సమన్వయకమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత, ఉద్యోగులు, మహిళలు, రైతులకు ఎలాంటి పథకాలుంటే బాగుంటుందన్న దానిపై సమన్వయ కమిటీ భేటీలో చర్చించినట్లు తెలిపారు.