TDP-Janasena Candidates First List Today : నేతలు, కార్యకర్తలు, ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న తెలుగుదేశం-జనసేన అభ్యర్థుల తొలి జాబితా నేడు ప్రకటించే అవకాశం ఉంది. ఆ దిశగా ఇరు పార్టీల అధినేతలు కసరత్తు ముమ్మరం చేశారు. ఉదయం 11 గంటల తర్వాత ఇరు పార్టీల అధినేతలూ.. ఒకే వేదికపైకి వచ్చి అభ్యర్థుల జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అంతకంటే ముందు అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో ఉదయం 9 గంటలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ఉండవల్లిలోని ఆయన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, చినరాజప్ప, నక్కా ఆనంద్బాబుతో సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ప్రకటనపై టిడిపి అధినేత చర్చించారు. ఈ భేటీ అనంతరం అభ్యర్థుల వివరాలపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో.. తొలిజాబితాలో ఎవరెవరి పేర్లుంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read More : విశాఖలో ఓట్ల తొలగింపు.. 10 వైసీపీ బీఎల్ఏలపై కేసు..
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. పొత్తులు, ఉమ్మడి కార్యాచరణను వేగవంతం చేసే దిశగా తెలుగుదేశం – జనసేన కసరత్తు ముమ్మరం చేశాయి. ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న అంశంపై పార్టీ నేతలు, శ్రేణులకు స్పష్టతనిచ్చే ప్రక్రియను చంద్రబాబు, పవన్ కల్యాణ్ వేగవంతం చేశారు. నిన్న సాయంత్రం చంద్రబాబు, లోకేశ్ హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చేరుకోగా.. పవన్ కల్యాణ్ విడిగా అమరావతికి చేరుకున్నారు.
దీంతో అభ్యర్థుల ప్రకటనపై ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు.. BJPతో పొత్తుపై చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి జాబితా ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. అప్పటి వరకూ వేచి చూడకుండా.. తొలి జాబితాను ప్రకటించి.. కార్యకర్తల్లో జోష్ పెంచాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా.. తొలిజాబితాలో 60-70 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. టీడీపీ నుంచి 50-70 లోపు, జనసేన నుంచి 12-18 వరకూ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. ఉదయం 11.40 గంటలకు ఇరు పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. బీజేపీతో పొత్తులతో క్లారిటీ వచ్చిన అనంతరం.. మిగతా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.
ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అప్పటిలోగా బీజేపీతో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.