TDP : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను టీడీపీ బృందం కలిసింది. పుంగనూరు, తంబళ్లపల్లిలో జరిగిన హింసాత్మక ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండా ఉమా, గద్దె రామ్మోహన్, అశోక్ బాబు.. శుక్రవారం జరిగిన దాడుల వీడియోలను, ఫోటోలను గవర్నర్కు అందించారు.
పుంగనూరు ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దాడులు, చేస్తున్నారని విమర్శించారు. పల్నాడులో టీడీపీ కార్యకర్త కోటయ్యపై వైసీపీ నేత కృష్ణమూర్తి దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కోటయ్యపై రెండోసారి దాడి చేశారని మండిపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా నిందితులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ తాటాకు చప్పుళ్లకు టీడీపీ భయపడదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు.
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నుసన్నల్లో దాడులు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు పులివెందుల పర్యటన విజయవంతం కావడంతో వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే పుంగనూరులో అల్లర్లు ప్రేరేపించారని ఆరోపించారు.
పుంగనూరులో టీడీపీ శ్రేణులపై రాళ్లదాడిని నిరసిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో టీడీపీ నాయకులు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నిరసనలు తెలపటానికి అనుమతి ఇవ్వలేదు. హిందూపురంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రమేశ్తోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
మాజీ మంత్రి పరిటాల సునీత చెన్నెకొత్తపల్లిలో నిరసన తెలపటానికి వెళ్తుండగా 44వ జాతీయ రహదారిపై మరూరు టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలిసి బైఠాయించారు.