కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంశం రావణకాష్టంలా మారుతోంది. ఇందుకు వైసీపీ నేతలు మాట్లాడే మాటలే కారణం. లడ్డూ అంశంపై ఏం మాట్లాడాలో తెలియక వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెగ సతమతమవుతున్నారు. ఇందులో భాగంగానే పూటకో నేత విచిత్ర మాటలతో ఏదేదో వాగుతూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తలపోటు తీసుకొస్తున్నారు. ఈ నేతల దిగజారుడు మాటల వల్లే వైసీపీపై జనాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రులు కొడాలి నాని, విడదల రజిని, ఆర్కే రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు లాంటి వాళ్ల లాంటి వ్యాఖ్యల వల్లే గత ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యారని వైసీపీ శ్రేణులు, మద్ధతుదారులు ఇప్పటికీ రగిలిపోతున్నారట. ఇప్పుడు మళ్లీ తాజాగా లడ్డూ విషయంలోనూ వచ్చి రాని మాటలతో జగన్ ను ఇరకాటంలో పడేస్తున్నారని టాక్.
పొన్నవోలు మాటల కలకలం…
మరోవైపు అధికార టీడీపీ పార్టీ సైతం గత ప్రభుత్వ పెద్దలపై భక్తుల తరఫున తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తోంది. తిరుమల లడ్డూ పవిత్రతని మరింత దెబ్బతీసేలా మాజీ స్పీకర్, మంత్రులు మదమెక్కినట్టు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడింది.
ఇక టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తరఫున సుప్రీంలో ఆయన కేసు వాదిస్తున్న న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం విస్మయకర మాటలు మాట్లాడుతున్నారని తెలుగుదేశం గుర్రుగా ఉంది. పందికొవ్వు బంగారం అని, లడ్డూలో నెయ్యి రాగి అని కించపరిచాడని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
‘కొవ్వు’ మాటలు..
యానిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ అని పొన్నవోలు సరికొత్త నిర్వచనం చెప్పారు. అంతేకాదు మార్కెట్లో కిలో పంది నెయ్యి దాదాపుగా రూ.1400కుపైనే ఉంటుందన్నారు. అయితే కేవలం రూ.319 ఖర్చుయ్యే కిలో నెయ్యికి రూ.1400 ఖర్చు చేశారని పొన్నవోలు చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో భక్తులకు తెలియడం లేదు.
ఇక అతితెలివిగల పొన్నవోలు సుధాకర్ రెడ్డి, స్వామివారి లడ్డూను రాగి చెంబుతో పోల్చారు. పంది కొవ్వును బంగారంతో పోల్చి భక్తుల గుండెల్లో అగ్గి రాజేశారు. ఇక నెయ్యి కంటే పంది కొవ్వే ఖరీదైనదని, అలాంటప్పుడు పందికొవ్వును లడ్డూ తయారీలో ఎలా వాడతారంటూ వైసీపీ సీనియర్ లాయర్ పొన్నవోలు కలకలం సృష్టించారు.
కొడాలి నాని ప్రవచనాలు…
ఇక మాజీ మంత్రి, వివాదాస్పద వైసీపీ నేత కొడాలి నాని సైతం వెరైటీ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు భక్తులను బుజ్జగించే రీతిలో మాట్లాడుతుండటం భక్తులకు హాస్యాస్పదంగా అనిపిస్తోంది. జంతువుల కొవ్వు కలిసిన ఆహారం తిన్నామని, లడ్డూ తిన్నవారు ఎవరూ బాధపడొద్దంటూ నాని ప్రవచించాడంటూ టీడీపీ సెటైర్లు వేసింది.
Also Read : టీటీడీ ఛైర్మన్ గా మాజీ సీజేఐ.. దాదాపు ఖరారైనట్లేనా ?
తమ్మినేని వినయ విధేతలు…
స్పీకర్ పదవికే కళంకం తెచ్చిన తమ్మినేని సీతారాం నెయ్యి కల్తీ కాలేదు, కానీ ఆవులే కల్తీ అయ్యాయంటున్నాడని ట్విట్టర్లో భగ్గుమంది టీడీపీ. ఆవులు పోషకాహారంతో బాధపడుతున్నాయని మాజీ సభాపతి అన్నారు. అలాంటి ఆవులు బయట ఏవేవో తింటుంటాయని, ఫలితంగా నెయ్యి కల్తీ అవుతుందనడం విమర్శలకు తావిస్తోంది. దీంతో లడ్డూ కల్తీ అంశంపై దేశ విదేశాల్లో ఉన్న ఏడుకొండల స్వామి వారి భక్తులు ఆగ్రహావేశాలతో రలిగిపోతున్నారు. దీంతో భక్తుల చేత నానా తిట్లు తింటున్నారు.