Tirumala latest news today(Latest telugu news in AP) : తిరుమల కాలిబాటలో చిరుతదాడి చేసి చిన్నారిని చంపేయడం తీవ్ర కలకలం రేపుతోంది. టీటీడీ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ వైఖరి వల్లే చిన్నారి చనిపోయిందనే ఆక్రోశం లక్షిత స్వగ్రామంలో వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెంలో లక్షితను కడసారి చూసేందుకు ఊరు ఊరంతా కదిలొచ్చింది. కన్నీరు పెట్టింది. ఈ మరణానికి నూటికి నూరు శాతం టీటీడీదే బాధ్యత అని మండిపడుతున్నారు. ఇటీవల ఓ బాలుడిపై దాడి చేసినప్పుడే.. అధికారులు తగు రక్షణ చర్యలు తీసుకుని ఉండుంటే.. ఇప్పుడిలా నిండుప్రాణం క్రూరమృగానికి బలి కాకపోయేదిగా అని ప్రశ్నిస్తున్నారు.
అంతా టీటీడీపై విరుచుకుపడితే.. చిన్నారి లక్షిత మృతిపై కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాప తల్లిదండ్రుల పాత్రపై అనుమానాలు ఉన్నాయంటూ కామెంట్ చేశారు. లక్షిత తల్లిదండ్రులను విచారించాలని కూడా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఇక, లక్షిత మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే ఓ బాలుడు మృతి చెందాడని.. అప్పటి నుంచి టీటీడీ రక్షణ చర్యలు చేపట్టి ఉంటే ఈ రోజు ఈ దారుణం జరిగి ఉండేది కాదన్నారు. పాప తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటికైనా టీటీడీ పటిష్ట చర్యలు చేపట్టి భక్తుల్లో ఉన్న భయాలను తొలగించాలని కోరారు చంద్రబాబు.