Chandra Babu, Pawan and Modi Alliance Seats(Latest election news in AP): సుదీర్ఘ చర్చల అనంతరం టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య ఎట్టకేలకు పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఆ మూడు పార్టీలు నిర్ణయించాయి. ఇక లోక్సభ స్థానాల్లో టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 చోట్ల పోటీ చేయడానికి ఆ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకుపైగా మూడు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు.
ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో, ఏయే సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై చర్చలు జరిపి తుది నిర్ణయానికి వచ్చారు. బీజేపీ తరపున కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బైజయంత్ పండా, చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు దిల్లీ నుంచి వచ్చిన బీజేపీ సీనియర్ నాయకులే పూర్తి చేశారు. వారి వద్దనున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి సీట్లను ఖరారు చేశారు.
చర్చల్లో కుదిరిన అంగీకారం మేరకు బీజేపీ అరకు, అనకాపల్లి, విజయనగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్సభ స్థానాల్లో.. జనసేన కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. రాజమహేంద్రవరం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజుల అభ్యర్థిత్వం దాదాపు ఖరారైంది. మిగిలిన 4 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీజేపీ ఈరోజు ప్రకటించే రెండో విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు.
Also Read: రెండ్రోజుల్లో టీడీపీలోకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు.. ఎన్నికల బరిలో వారసుడు ?
అసెంబ్లీ స్థానాల్లో ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతోపాటు మరో నాలుగు స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశముంది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్యలు జరిపారు. ఆ చర్చల్లో జనసేన, బీజేపీ కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించాలని ప్రాథమిక అవగాహనకు వచ్చారు. బీజేపీ 6 పార్లమెంటరీ స్థానాల్లో పోటీ చేయాలని అప్పుడే నిర్ణయం జరగ్గా.. నిన్న జరిగిన చర్చల్లో ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో రాబోయే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు మూడు పార్టీలూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు మూడు పార్టీలూ కట్టుబడి ఉన్నాయని, తద్వారా అంతర్జాతీయంగా భారతదేశ నాయకత్వం పరిఢవిల్లాలనేది తమ ప్రగాఢ ఆకాంక్ష అని తెలిపాయి.
ఈ జాయింట్ డిక్లరేషన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా ‘X’ లో పోస్టు చేశారు. పొత్తును ఆశీర్వదించాలని, చారిత్రాత్మక తీర్పు నివ్వాలని కోరారు. జనసేన కూడా దీనిపై ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కూటమి ఉంటుందని.. సీట్ల పంపకం విషయంలోనూ రాష్ట్ర భవిష్యత్తుకే ప్రథమ ప్రాధాన్యమిచ్చినట్టు వారు పేర్కొన్నారు. ఎన్డీఏ భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు.