TDP-Janasena-BJP Alliance update(Andhra pradesh election news): ఆంధ్ర ప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కలసి పోటీ చేయనున్నట్లు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఏపీని వైసీపీ నుంచి కాపాడుకోవాలని.. అందుకే మూడు పార్టీలు కలసి బరిలో నిల్చోడానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
కాగా శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు.ఈ క్రమంలోనే ఎన్డీయేతో కలసి పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్డీయేలో టీడీపీ భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం. అటు జనసేన పార్టీని ఎన్డీయేలో విలీనం చేయాలని అమిత్ షా పవన్ కల్యాణ్ను కోరినట్లు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా బీజేపీ-జనసేన కలిపి 30 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో జనసేన 24 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా బీజేపీ ఆరు ఎంపీ, ఆరు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. కాకినాడ ఎంపీగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది.