TDP : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావడం టీడీపీకి అస్త్రంలా మారింది. ఇదే అదునుగా ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎటాక్ కు దిగింది. ఆ పార్టీ నేతలందరూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ట్విట్టర్ లో జగన్ పై విమర్శలు గుప్పించారు. ‘‘ సొంత బాబాయ్ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్ జగన్రెడ్డీ?’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. సీఎం పదవికి జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
లోకేష్ ట్వీట్
బాబాయ్ వివేకానందరెడ్డిని చంపించింది అబ్బాయేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ‘‘బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రానికి.. అబ్బాయ్ చంచల్గూడ జైలుకి’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
అచ్చెన్న ఫైర్
సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ కావడం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖకు మాయని మచ్చ అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తనలో ఏమాత్రం నైతికత మిగిలి ఉన్నా జగన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
బొండా ప్రశ్నలు
వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ చేయడంపై జగన్ ఏం సమాధానం చెబుతారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు.. తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయాన్ని బహిర్గతం చేసిందన్నారు. జగన్ బ్యాచ్ పథకం ప్రకారమే గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చారన్న విషయం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తేటతెల్లమైందని బొండా ఉమా అన్నారు.