Free Gas Cylinder Scheme: దీపావళికి ఏపీ ప్రభుత్వం కానుక ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ హామీని ప్రభుత్వం తాజాగా నెరవేర్చింది. పేద కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండదండగా నిలిచేందుకు, ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేయనున్నట్లు పరకటించిన ప్రభుత్వం, ఈ సిలిండర్లను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని నేటి నుండే ప్రారంభించింది. ఈనెల 31వ తేదీ దీపావళి నుండి గ్యాస్ సిలిండర్ ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. అర్హత గల ప్రతి లబ్ధిదారురాలికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించాలన్న లక్ష్యంతో దీపం పథకం ద్వారా పండుగ రోజు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కాగా దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో.. ప్రభుత్వానికి రూ.2684 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అధికార వర్గాల లెక్క.
ప్రతి పేద కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకం వర్తించేందుకు కావాల్సిన అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియ ప్రకారం లబ్దిదారులు వివరాలు నమోదు చేసుకోకపోతే పథకం వర్తించదు. అందుకే ఒకసారి ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు తెలుసుకుందాం.
దీపం పథకం లబ్దికి అర్హతలు ఇవే..
మహిళలు తప్పనిసరిగా రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి. అలాగే దరఖాస్తుదారురాలి వయస్సు తప్పనిసరిగా 18 సంవత్సరాలు, అంతకంటే పై వయస్సు వారు అర్హులు. ఆర్థికంగా వెనకబడిన వారు ఈ పథకానికి అర్హులే. రేషన్ కార్డును కలిగి ఉంటేనే పథకానికి అర్హులవుతారు.
దరఖాస్తుకు పథకం అవసరమైనవి ఇవే..
గ్యాస్ కనెక్షన్ కు సంబంధించి కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకొని ఉండాలి. లబ్దిదారుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు, ఆధార్ కు ఫోన్ నెంబర్ అనుసంధానం కలిగి ఉండాలి. ఏడాదికి మూడు ఉచితం సిలిండర్ల పథకం ద్వారా లబ్ది పొందాలంటే, ఆన్ లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మీసేవా ద్వారా కూడా దరఖాస్తులను సమర్పించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మీ రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకంలలో నమోదైన పేరు, చిరుమానాలు సక్రమంగా నమోదు చేశారా లేదన్నది గమనించాలి. అనంతరం డాక్యుమెంట్స్ ఫొటోలు కూడా సంబంధిత సిబ్బంది అప్ లోడ్ చేస్తారు.
మొత్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తైన అనంతరం సంబంధిత అధికారులు పరిశీలించి.. అర్హుల జాబితాను 31వతేదీలోగా సిద్దం చేస్తారు. 31వతేదీ నుండి ఈ సిలిండర్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ పథకంతో సామాన్య కుటుంబాలకు ఆర్థికభారం తగ్గించాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కాగా, అన్ని దృవీకరణ పత్రాలు కలిగి ఉండి, వివరాలు సక్రమంగా నమోదు చేసుకుంటే చాలు.. పథకం మీకు వర్తిస్తుంది.