Tarakaratna: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపింది. ఎక్మో సహాయంతో కృత్రిమ శ్వాస అందిస్తున్నామని.. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు.
పేషెంట్ పరిస్థితి వెరీ సీరియస్ గా ఉన్నప్పుడే ఎక్మో, బెలూన్ యాంజియోప్లాస్టీ సపోర్ట్ తీసుకుంటారు. ఆ చికిత్స తీరు చూస్తుంటే.. తారకరత్న ఆరోగ్యంపై నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ బెంగళూరులోనే ఉండి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరు వెళ్లనున్నారు.
శుక్రవారం కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు హాజరైన తారకరత్న.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కుప్పం వైద్యులు వెంటనే సీపీఆర్ చేసి పల్స్ తీసుకొచ్చారు. యాంజియోగ్రామ్ చేసి గుండెలో బ్లాక్స్ ఉన్నాయని గుర్తించారు. ఎడమ గుండెలో 90శాతం బ్లాక్స్ ఉన్నాయన్నారు. మెరుగైన చికిత్సకు బెంగళూరు తీసుకెళ్లాలని సూచించారు.
బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ వైద్యలు, అంబులెన్సులు శుక్రవారం సాయంత్రానికి కుప్పం చేరుకున్నాయి. తారకరత్నను వైద్య పర్యవేక్షణలో బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స అందిస్తున్నారు. ఆయన గుండె పని తీరు పూర్తిగా అవుటాఫ్ కంట్రోల్ కావడంతో.. ఎక్మోతో కృత్రిమ శ్వాస, బెలూన్ యాంజియోప్లాస్టీతో బ్లడ్ పంపింగ్ చేస్తున్నారు. తారకరత్న పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. తారకరత్న కుటుంబం హాస్పిటల్ లోనే ఉంది.