Taraka Ratna: టీడీపీ నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. శుక్రవారం అర్థరాత్రి ప్రత్యేక అంబులెన్స్లో బెంగళూరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఐసీయూలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. డాక్టర్ ఉదయ్ నేతృత్వంలోని వైద్యుల బృందం తారకరత్నకు చికిత్స అందిస్తోంది. అతని వెంట భార్య అలేఖ్యారెడ్డి, నందమూరి బాలకృష్ణ ఉన్నారు.
బెంగళూరు నుంచి అత్యాధునిక వైద్య పరికరాలు తీసుకురావడంతో కుప్పం పీఈఎస్ ఆసుపత్రిలోనే తారకరత్నకు వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అర్థరాత్రి సమయంలో బెంగళూరుకు తరలించారు. ప్రత్యేక అంబులెన్స్లో కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ బెంగళూరుకు తీసుకెళ్లారు.
తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అతని గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయిందని.. మిగతా పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారు.