జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు. అద్భుత నటనతో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించి తన ప్రసంగాలతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సినిమాలకే పరిమితమయ్యాడు. రాజకీయ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగానే ఉంటున్నాడు. అయితే తన తాత ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనక పోవడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా ఎన్టీఆర్ రూ.100 నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి భవన్లో ఘనంగా నిర్వహించారు. నందమూరి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటంపై చర్చ జరుగుతోంది.
తారక్ ను ఆహ్వానించామని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి అతడే కావాలనే ఈ కార్యక్రమానికి వెళ్లలేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత స్మారకంగా కేంద్రం రూ. 100 నాణెం విడుదల చేసిన కార్యక్రమానికి వెళ్లలేనంత బిజీనా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే దేవర షూటింగ్ ఉండటంతో హాజరుకాలేదని తెలుస్తోంది.
కొన్నిరోజుల క్రితం హైదరాబాద్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి తారక్ ను ఆహ్వానించారు. కానీ ఆ కార్యక్రమానికి రాలేదు. మాట్లాడితే తాత పేరు చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ ఆ మహనీయుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. కానీ చంద్రబాబు , నారా లోకేశ్ పర్యటనల్లో కొంతమంది ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ప్రదర్శించి కలకలం రేపిన ఘటనలు చాలా చోట్ల జరిగాయి. ఇప్పుడు ఫ్యామిలీకి కూడా తారక్ దూరమయ్యారా? ఎందుకు ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు? ఈ సందేహాలు సామాన్యుల్లో వ్యక్తమవుతున్నాయి.
కొన్నిరోజుల క్రితం విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు తారక్ ను ఆహ్వానించలేదని వార్తలు వచ్చాయి. ఆ కార్యక్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. ఆ తర్వాతే హైదరాబాద్ లో వేడుక నిర్వహించారు. అందువల్లే ఎన్టీఆర్ అలిగారని అందుకే రాలేదని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంతకీ తారక్ మనసులో ఏముంది? తాత శతజయంతి కార్యక్రమాలకు ఎందుకు రావడంలేదు? ఈ ప్రశ్నలకు తారకే సమాధానం చెప్పాలి.