CM Jagan
CM Jagan : విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారంటూ ఎల్లో మీడియాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇక్కడి నుంచే ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.
కాగా వరుసగా రెండో ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేపట్టింది.పేదింటి పిల్లలు అంతర్జాతీయ వేదికపై తమ సత్తాచాటాలన్న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. దాదాపు 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 4,34,185 ట్యాబ్స్ను 9,424 పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. నాకు కొండంత అండగా నిలబడే అడవితల్లి బిడ్డల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చిక్కటి చిరునవ్వుల మధ్య, ప్రేమానురాగాల మధ్య, ఆప్యాయతల మధ్య జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని జగన్ తెలిపారు. 55 నెలలుగా ప్రతి అడుగు విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా వేశామని… పిల్లలకు అవసరమైన బైజుస్ కంటెంట్తో ట్యాబ్లు ఇస్తున్నామన్నారు జగన్.