YCP : వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సర్వే రిపోర్టులు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్లో కలవరం పుట్టిస్తున్నాయి.
ఏపీ ఎన్నికలకు 6 నెలల సమయం కూడా లేదు. ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే ప్రక్రియను మొదలపెట్టారు సీఎం జగన్. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్ లో 25 అంశాలతో కూడిన లేఖలను దసరా గిఫ్ట్గా జగన్ పంపారు. అక్టోబర్ 20లోగా ఈ లేఖలు ఎమ్మెల్యేలకు చేరతాయని తెలుస్తోంది.
నాలుగున్నరేళ్లలో ఎమ్మెల్యేల పనితీరు వివరాలు ఈ లేఖలో ఉంటాయని సమాచారం. పనితీరు బాగోలేని వారికి జగన్ పరోక్షంగా హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది. ప్రజా మద్దతు లేని ఎమ్మెల్యేలకు ఈసారి సీటు ఇవ్వడంలేదని వార్తలు వస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లోగా లోపాలను సరిచేసుకోలేకపోతే కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తామని సంకేతాలు బలంగా పంపారని టాక్. తానే స్వయంగా నియోజకవర్గాల్లో అడుగుపెడతాడని సీఎం తేల్చిచెప్పడంతో సిట్టింగుల్లో కలవరం మొదలైంది.
గతంలోనూ సీఎం జగన్ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లాలని ఆదేశించారు. ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమంపై చాలాసార్లు సమీక్షలు నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగామ్ లో వెనుకబడిన ఎమ్మెల్యేలకు ఆ సమయంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్ సర్వే రిపోర్టులు పంపి ఎమ్మెల్యేల్లో కలవరం రేపారు.