Supremecourt : వివేకా హత్యకేసు దర్యాప్తు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సీబీఐ రంగం సిద్ధం చేసింది. మరోవైపు న్యాయపరంగా తనకున్న ప్రత్యామ్నాయాలను అవినాష్ రెడ్డి వెతుకుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తక్షణం విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని మిసిలేనియస్ అప్లికేషన్ వేశారు.
దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి సూచించింది. అవినాష్ రెడ్డి వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు సూచించింది. దీంతో గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరగనుంది. మరి బెయిల్ వస్తుందా..? రాదా అనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు అవినాష్ రెడ్డి ప్రస్తుతం తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్న కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయన అనుచరులు ఆస్పత్రి వద్ద భారీగా ఉన్నారు. ఇంకోవైపు ఆస్పత్రి వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఈనెల 19న తల్లి శ్రీలక్ష్మిని అవినాష్ రెడ్డి ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అవినాష్ రెడ్డి అక్కడే ఉన్నారు. సోమవారం అవినాష్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఆస్పత్రికి రెండు సీబీఐ బృందాలు వచ్చాయి. అయితే ఒక బృందం సోమవారం రాత్రి కర్నూలు నుంచి హైదరాబాద్కు వెళ్లిపోయింది. మరో బృందం ఇంకా పోలీసు రెస్ట్హౌస్లోనే ఉంది.