Supremecourt : అమరావతి రాజధాని కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? అని నిలదీసింది. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? అని ప్రశ్నించింది. ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం చేయాలంటారా? మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కదా? అని పలు ప్రశ్నలు సుప్రీంకోర్టు వేసింది. హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని అతిక్రమించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
రాజధాని ఇదే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రానికి చెప్పలేమని తెలిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినా కోర్టు.. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది. ఆలోపు జవాబు తప్పనిసరిగా దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
అమరావతి విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం ముందు విచారణ జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, శ్రీరామ్, నిరంజన్రెడ్డి వాదనలు వినిపించారు. రాజధాని ప్రాంత రైతుల తరఫున సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ వాదించారు. హైకోర్టు ఆదేశించిన ఏడు అంశాలపై స్టే విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా. కాలపరిమితికి సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే సుప్రీంకోర్టు విధించింది.