Supreme court : సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటుపై ఇచ్చిన జీవోలను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
సిట్ ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. మెరిట్ ప్రాతిపదికనే కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసు విచారించి తుది నిర్ణయం వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందుకోసం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. సిట్ ఏర్పాటుపై స్టే ఇచ్చింది. ఈ స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేసింది.
దర్యాప్తు ప్రాథమిక దశలోనే సిట్ ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇవ్వడం సరైంది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని పేర్కొంది. జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీంకోర్టు బెంచ్ అభిప్రాయపడింది. హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నామని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ MM సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఇక కేసు విచారణ సమయంలో.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృథా , దురుద్దేశం అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి? గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని వ్యాఖ్యానించింది.