ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
పదేళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని ఆ పిటిషన్ లో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని ఆరోపించారు. అందుకే వెంటనే జగన్ బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు .. సాక్ష్యాలు చెరిపేస్తున్నారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అని ప్రశ్నించింది.
ఈ కేసుపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు సమర్పించారు. జగన్కు బెయిల్ మంజూరైన తర్వాత.. దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తర్వాత ప్రక్రియ చేపట్టాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విచారణను బదిలీ చేయాలని రఘురామకృష్ణరాజు ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను కూడా జత చేయాలని రిజిస్ట్రీని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తుదిపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.