2015లో తెలుగ రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో సంచలనాన్ని రేపిన కేసు ఓటుకు నోటు కేసు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన పిటిషన్లు వేశారు. వీటితోపాటు ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కూడా ఈ కేసులో చేర్చాలని ఓ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే.. ఆ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలనీ మరో పిటిషన్ వేశారు. తాజాగా, ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించి కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడును కూడా ఓటుకు నోటు కేసులో చేర్చాలనే పిటిషన్, ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసులో చంద్రబాబు నాయుడును చేర్చడానికి బలమైన ఆధారాలు, కారణాలేమీ లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సందర్భంగా పిటిషన్ వేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్కేను మందలించింది. రాజకీయ కక్ష్యల కోసం న్యాయస్థానాలను వేదిక చేసుకోవద్దని హితవు పలికింది. మాజీ ఎమ్మెల్యే ఆర్కేను మందలిస్తూనే.. ఆయన దాఖలు చేసిన రెండి పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఎం సుందర్,జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసం బుధవారం డిస్మిస్ చేసింది.
Also Read: Janwada Farm House: జన్వాడ ఫామ్హౌజ్ కూల్చివేతపై హైకోర్టు తీర్పు ఇదే
ఈ కేసులో చంద్రబాబు నాయుడిని కూడా చేర్చాలని తొలుత ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. తాజాగా, సుప్రీంకోర్టు కూడా.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
ఈ తీర్పు నేపథ్యంలో తమ నాయకుడు ఆ కుట్ర కేసు నుంచి కడిగిన ముత్యంగా బయటపడ్డాడని పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ పదేళ్ల పాటు చేసిన ఈ కుట్ర చివరికి విఫలమే అయిందని పేర్కొన్నారు. సత్యం ఆలస్యంగానైనా బయటికి వస్తుందని, తమ నాయకుడు మచ్చలేని మనిషి అని తెలుగు దేశం పార్టీ శ్రేణులు పొగడ్తలు కురిపిస్తున్నాయి.