Viveka Murder Case: వివేకా మర్డర్ కేసు విచారణ కీలక దశలో ఉంది. జూన్ 30 కల్లా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. ప్రస్తుతం వివేకా హత్యలో అవినాష్రెడ్డి పాత్ర చుట్టూనే తిరుగుతోంది సీబీఐ దర్యాప్తు. ఆయన్ను అరెస్ట్ చేస్తారని భావించినా.. అలాంటిదేమీ జరగలేదు. దీంతో.. వైఎస్ సునీత బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. అంతకష్టపడి కోర్టుకెళ్లి.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ను రద్దు చేయించినా.. తాను ఆశించిన విధంగా కేసు దర్యాప్తు ముందుకు సాగట్లేదనే ఫీలింగ్లో సునీత ఉన్నట్టుంది. అందుకే, సీబీఐ విచారణను ట్రయల్ కోర్టు పర్యవేక్షించాలంటూ కోర్టుల చుట్టూ మరోసారి తిరుగుతున్నారు సునీత.
దర్యాప్తును పర్యవేక్షించాలని మొదట ట్రయల్ కోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేసింది. జూన్ 30 వరకు దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున తాము పర్యవేక్షించలేమని.. సునీత దాఖలు చేసిన పిటిషన్ ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో ట్రయల్ కోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్ సునీత.
వివేకా హత్య కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించేందుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్పష్టత ఇవ్వాలని కోరింది వైఎస్ సునీత. ఈ నెల 20 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులున్న కారణంగా పర్యవేక్షణ ఉండదనే అభిప్రాయంతో.. ట్రయల్ కోర్టు పర్యవేక్షణకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు.
మరోవైపు, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ మరింత దూకుడు పెంచింది. వివేకా రాసిన లేఖపై ఎవరెవరి వేలిముద్రలు ఉన్నాయో గుర్తించేందుకు సీబీఐ కసరత్తు ప్రారంభించింది. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఇప్పటికే ఢిల్లీ CFSNL తేల్చింది. లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ను సీబీఐ కోరింది. తాజాగా ఈ లేఖపై నిన్హైడ్రేట్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అధికారులు.