Summer Effect : తెలుగురాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. తెలంగాణలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.వచ్చే 5 రోజులు తెలంగాణలో పలు జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్తోపాటు…. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఏపీలోనూ ఎండలు మండుతున్నాయి. మంగళవారం అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, మాకవరపాలెంలో 42.5, అనకాపల్లి మండల కేంద్రం, కోటవురట్లలో 42.4 డిగ్రీలు, కాకినాడ జిల్లా తొండంగిలో 41.8, తునిలో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఏపీలో బుధవారం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా 4 మండలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ జిల్లా కోటనందూరు, అనకాపల్లి జిల్లా గొలుగొండ, నాతవరం మండలాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతోపాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని 126 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ఏప్రిల్లోనే ఎండలకు బండరాయి పగలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఎండల నేపథ్యంలో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు. వాహనాలపై వెళ్లే ప్రయాణికులు చెట్ల కింద కాసేపు ఆగి సేద తీర్చుకుంటున్నారు. విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రజలు ఎండదెబ్బ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.