Establishment of Airport at Anantapur(AP news live): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. అనంతపురంలో అనువైన భూమి చూపిస్తే విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు అధ్యయనం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఇక్కడ ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, స్థానిక ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి ఇటీవల చేసిన విజ్ఞప్తి పై కేంద్రమంత్రి స్పందించారు. విమానాశ్రయానికి కావాల్సిన భూమి చూపితే తదుపరి ప్రణాళికను చేపడుతామన్నారు. ఇందుకు 1200 ఎకరాలు అవుసరమవుతుందని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే.. భోగాపురం ఎయిర్ పోర్టును మోడ్రన్ ఎయిర్ పోర్టుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం తెలిసిందే. గురువారం భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్రమంత్రులు శ్రీనివాస్, సంధ్యారాణి, పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంతకుముందు చంద్రబాబు ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టును 2026 జూన్ 30 నాటికి పూర్తిచేస్తామని అధికారులు చెప్పారని, అంతకంటే ముందుగానే పూర్తి చేయాల్సిందిగా సూచించినట్లు ఆయన చెప్పారు. ఫేజ్ -1లో భాగంగా భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2 లో మరో 50 కిలో మీటర్లతో శ్రీకాకుళం, ఫేజ్-3 లో మూలపేట వరకు రోడ్డు పనులను పూర్తి చేస్తామంటూ చంద్రబాబు వివరించారు.
Also Read: ఆ బాబును నేనే చదివిస్తా: సీఎం చంద్రబాబు
ఎయిర్ పోర్టు నిర్మాణానికి రూ. 4,700 కోట్లు వ్యయం చేస్తున్నట్లు సీఎం చెప్పారు. 45 లక్షల మంది ప్రయాణికులు ఈ ఎయిర్ పోర్టు ద్వారా ప్రయాణాలు సాగించవచ్చని అంచనాగా ఉందని చంద్రబాబు తెలిపారు. ఈ ఎయిర్ పోర్టు పూర్తై వినియోగంలోకి వస్తే ఉత్తరాంధ్ర ఎకనమిక్ హబ్ గా మారనున్నదంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.