AP Half Day Schools: మార్చి వచ్చి వారంరోజులైంది. ఎండలు మండిపోతున్నాయ్. ఏపీలో ఇంకా ఒంటిపూటబడులు మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతాయో క్లారిటీ లేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఆలస్యమైతే విద్యార్థులు వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉందని కలత చెందుతున్నారు. తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. మరి ఏపీలో ఎప్పటి నుంచి మొదలవుతాయన్నది తెలీదు. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. వీటి తర్వాత అంటే.. మార్చి 18వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు మొదలవుతాయి.
10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదలైతే.. పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారని తెలిసిన విషయమే. కానీ.. ఒక పక్క ఎండలు మండిపోతుంటే.. మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించడం కూడా ప్రమాదమే. మండుటెండలో విద్యార్థులు స్కూల్ కు వెళ్లాల్సి ఉంటుంది. వెంటనే ఏపీలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మార్చి 11వ తేదీ నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని, ఈ మేరకు వెంటనే ప్రకటన చేయాలని అధికారులను డిమాండ్ చేస్తూ.. వినతిపత్రాన్ని అందజేశారు.
Read More: 14 రోజుల ఉత్సవం.. నేడు నాల్గవ విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదల
అలాగే.. మున్సిపల్ ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు. ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ల ఉద్యోగ ఉన్నతి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇటీవల కేంద్రం 1వ తరగతి ప్రవేశాలకు కనీస వయసు 6 సంవత్సరాలు ఉండాలని ఆదేశాలు జారీ చేయగా.. దానిని సవరించాలని కోరారు. కనీస వయసు 5 ప్లస్ గానే ఉండేలా చూడాలన్నారు. విద్యార్థుల ప్రవేశ వయసు పెరిగితే.. అడ్మిషన్లు తగ్గే అవకాశం ఉందన్నారు.
కాగా.. ఏపీలో ఒంటిపూటబడులతో పాటు వేసవి సెలవులపై ప్రభుత్వం దృష్టిసారించినట్లు తెలుస్తోంది. పదోతరగతి పరీక్షలకు కేంద్రాలుగా ఉన్న స్కూళ్లలో మధ్యాహ్నం నుంచి, మిగతా స్కూళ్లలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఒంటిపూట బడులు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. విద్యాక్యాలెండర్ ప్రకారం.. 2023-24 విద్యాసంవత్సరానికి ఏప్రిల్ 24న స్కూళ్లకు చివరి పనిదినం. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ వేసవి సెలవులు ఉండనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటిపై ప్రభుత్వం అధికార ప్రకటన చేయాల్సి ఉంది.
తెలంగాణలో మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ హాఫ్ డే స్కూల్స్ జరగనున్నాయి. ఏపీలో మాదిరి ఇక్కడ కూడా పదవ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహిస్తారు.